యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్‌

యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్‌
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పోర్టల్ ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని 125వ మన్‌ కీ బాత్‌ సందర్భంగా ఆదివారం తెలిపారు.

“యూపీఎస్సీ పేరు వినే ఉంటారు. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒక్కటైన సివిల్ సర్వీసెస్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. అత్యంత ప్రతిభావంతులైన వేలాది మంది అభ్యర్థుల స్వల్ప తేడాతో తుది జాబితాలో చోటు కోల్పోతుంటారు. ఫలితంగా వారు వేరే పరీక్షల కోసం మళ్లీ సిద్ధం కావాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం, డబ్బు రెండు కోల్పోతారు. అలాంటి వారి కోసం కొత్తగా డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించాం” అని ప్రధాని తెలిపారు. 

“దాని పేరు ప్రతిభా సేతు. ప్రతిభా సేతులో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అన్ని దశలు దాటి తుది జాబితాలో చోటు దక్కని వారి డేటా ఉంటుంది. ఈ పోర్టల్‌లో 10వేల మందికిపైగా ప్రతిభావంతులైన డేటా ఉంది. ఈ పోర్టల్‌ ద్వారా ప్రైవేటు సంస్థలు అభ్యర్థుల సామర్థ్యాన్ని తెలుసుకొని ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే వందలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి” అని ప్రధాని మోదీ వివరించారు.

స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలి


రానున్న రోజుల్లో వరసుగా పండుగలు ఉండటంతో ప్రతిఒక్కరు స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జీవిత ప్రయాణంలో వినియోగించే ప్రతీది స్వదేశీగా ఉండేటట్టు చూసుకోవాలని సూచించారు. “ఈ సమయంలో దేశం మొత్తం గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటోంది. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరిన్ని వేడుకలు జరుపుకోనున్నాం. ఈ పండుగల నడుమ స్వదేశీ మంత్రాన్ని మరవద్దు” అని సూచించారు. 
 
“భారత్‌లో తయారైన వస్తువులనే బహుమతులుగా ఇవ్వండి. దేశంలో ఉత్పత్తి అయిన వస్త్రాలనే ధరించండి. భారత్‌లో తయారైన వస్తువులతోనే ఇళ్లను అలంకరించండి. జీవిత ప్రయాణంలో వినియోగించే ప్రతీది స్వదేశీగా ఉండేటట్టు చూసుకోండి. స్వదేశీ అని గర్వంతో ఎలుగెత్తి చాటండి. ఇదే స్పూర్తితో మనం ముందుకెళ్లాలి. మన మంత్రం వోకల్ ఫర్ లోకల్‌. మన మార్గం ఆత్మనిర్భర్ భారత్. మన లక్ష్యం వికసిత్ భారత్‌” అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలపై ప్రధాని మోదీ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు దేశాన్ని పరీక్షిస్తున్నాయని చెబుతూ పలు రాష్ట్రాల్లో భారీ వరదలు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అనేక మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సైన్యం, ఎన్​డీఆర్‌ఎఫ్‌, ఎస్​డీ ఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగించారని కొనియాడారు. అలాగే వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో ప్రకృతి విపత్తు సంభవించినా అనేక విషయాల్లో ముందుకు వెళ్తుందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారని, పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా ఇందులో ప్రతిభ చూపారని తెలిపారు. 
 
గతంలో ఎన్నడూ చూడని విధంగా కశ్మీర్‌లోని పుల్వామాలో తొలి డే అండ్ నైట్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. దేశం మార్పు వైపు పయనిస్తోందనడానికి ఇవి ఉదాహరణగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.