
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాకు, ఆయన సతీమణికి బహుకరించిన కానుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ బహుమతులు కేవలం వస్తువులుగా మాత్రమే నిలవకుండా అవి భారతదేశ కళా సంస్కృతి, నైపుణ్యానికి ప్రతిబింబాలుగా నిలిచాయి. జపాన్ సంప్రదాయానికి, భారతదేశ వారసత్వానికి మధ్య అద్భుతమైన వారధులుగా నిలిచిన ఈ బహుమతులు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేశాయి.
ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాకు ప్రత్యేకంగా తయారు చేయించిన ‘వింటేజ్ మూన్స్టోన్ రామెన్ బౌల్స్’, వెండి చాప్స్టిక్స్ సెట్ను బహుకరించారు. ఈ గిన్నెలను ఆంధ్రాకు చెందిన సుప్రసిద్ధ చంద్రకాంత శిల (మూన్స్టోన్)తో తయారు చేశారు. రామెన్ అనేది జపాన్ ప్రజలకి ఇష్టమైన ఆహారం. కాబట్టి వారి సంస్కృతికి తగ్గట్లుగా ఈ గిన్నెలను ఎంపిక చేయడం మోదీ దౌత్య నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి.
ఈ గిన్నెలు కేవలం చంద్రకాంత శిలతోనే కాకుండా రాజస్థాన్లో లభించే అద్భుతమైన మక్రానా పాలరాయిని కూడా వాడారు. ఈ పాలరాయి బేస్పై సెమీ-ప్రీషియస్ రాళ్లతో ‘పర్చిన్ కారీ’ అనే రాజస్థానీ సంప్రదాయ శైలిలో అలంకరించారు. ఈ మూన్స్టోన్ను ప్రేమ, సమతుల్యత, రక్షణకు ప్రతీకగా చెబుతుంటారు. ఈ రామెన్ గిన్నెలకు జతగా, వెండితో తయారు చేసిన చాప్స్టిక్స్ను కూడా మోదీ బహుకరించారు.
అంతేకాకుండా మోదీ జపాన్ ప్రధాని సతీమణి యొషికో ఇషిబాకు కూడా ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. అది జమ్ముకశ్మీర్లోని లడఖ్లో చాంగ్తాంగి జాతి మేకల ఉన్నితో చేతితో నేసిన అరుదైన పష్మినా శాలువా. ఈ శాలువాను కశ్మీరీ సంప్రదాయ కళ అయిన ‘పాపియర్-మాచే’తో తయారు చేసిన ఒక పెట్టెలో అందంగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ పెట్టె పక్షులు, పూలతో కూడిన డిజైన్తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
ఈ బహుమతుల ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాల కళా నైపుణ్యాన్ని, గొప్ప వారసత్వాన్ని మోదీ ప్రపంచానికి చాటిచెప్పారు. మోదీ జపాన్ ప్రధానికి ఈ ప్రత్యేకమైన బహుమతులను ఇవ్వడం అనేది భారతదేశం-జపాన్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను తెలియజేస్తుంది. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఇది ప్రతీకగా నిలుస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్