జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లో  ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌ బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంట చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. ఈ ఆపరేషన్ ను `నౌషేరా నార్ 4′   పేరుతో విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌ జమ్మూకశ్మీర్ పోలీసులు అందించిన నిఘా సమాచారం ఆధారంగా జరిగింది.

 సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, పోలీసు బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న అనుమానాస్పద కదలికలు గమనించబడ్డాయి. వారిని లొంగిపోవాలని సైన్యం హెచ్చరించగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో సైనికులు ఎదురుదాడి చేసి, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

ఉగ్రవాదులు ఇంకా దాగి ఉన్నారనే అనుమానంతో గురెజ్ సెక్టార్ పరిసర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదనపు బలగాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల సరిహద్దు భద్రతా దళాల అప్రమత్తత మరోసారి రుజువైంది.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటు యత్నాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో పూంచ్ జిల్లాలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అలాగే, రెండు రోజుల ముందు పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్రవాదులను శ్రీనగర్ సమీపంలోని అడవుల్లో భద్రతా బలగాలు హతమార్చాయి.