ఉగ్రవాద సూత్రధారులకు స్పష్టమైన సందేశాన్ని పంపాం 

ఉగ్రవాద సూత్రధారులకు స్పష్టమైన సందేశాన్ని పంపాం 

భారత పౌరుల జీవితాలతో ఆడుకుంటే కలిగే పరిణామాల గురించి ఆపరేషన్​ సిందూర్​, ఆపరేషన్ మహదేవ్​ల ద్వారా ఉగ్రవాద సూత్రధారులకు స్పష్టమైన సందేశాన్ని పంపామని కేంద్రం హోంమంత్రి అమిత్​షా పేర్కొన్నారు. “ఆపరేషన్ సిందూర్​ ప్రజల్లో సంతృప్తి కలిగించింది. అయితే ఆపరేషన్ మహాదేవ్​ ఆ సంతృప్తిని విశ్వాసంగా మార్చింది” అని చెప్పారు.  ఆపరేషన్ మహాదేవ్​ను విజయవంతంగా నిర్వహించి, పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను తుదముట్టించిన భారత సైన్యం, జమ్మూకశ్మీర్​ పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బందిని సత్కరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“కశ్మీర్​లో పర్యాటకం మంచి స్థితిలో ఉన్నప్పుడు, పహల్గాంలో దాడులు చేసి, ‘కశ్మీర్​ మిషన్​’ పట్టాలు తప్పించడానికి ఉగ్ర సూత్రధారులు విఫలయత్నం చేశారు. అయితే ఉగ్రవాదులు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఇకపై వారు భారతదేశాన్ని దెబ్బతీసి, తప్పించుకోలేరని మన భద్రతా దళాలు ప్రపంచానికి చూపించాయి” అని అమిత్​ షా గుర్తు చేశారు.

“ఆపరేషన్ మహాదేవ్​లో హతమైన ఉగ్రవాదులు, పహల్గాంలో మారణహోమం సృష్టించిన వారేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ ల్యాప్​ నిర్ధరించింది. భారత పౌరుల హృదయాల్లో భద్రంగా ఉన్నామనే భావాన్ని మరింత బలపరిచిన మన భద్రతా దళాలకు ప్రధాని మోదీ తరఫున, మొత్తం భారతదేశం తరఫున నేను అభినందిస్తున్నాను” అని కేంద్ర హోంమంత్రి అమిత్​షా తెలిపారు.

“సైన్యం, పారామిలటరీ దళాలతో పాటు, జమ్మూకశ్మీర్​ పోలీసులు కూడా ఉగ్రవాదంపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్​, ఆపరేషన్ మహాదేవ్​ గురించి అధికార, ప్రతిపక్షాలు అన్నీ ఆనందంగా ఉన్నాయి. ప్రతిఒక్కరూ భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ భద్రతపై ఉన్న ఈ నమ్మకమే భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని సాధించాలనే ఆకాంక్షకు పునాది” అని అమిత్ షా పేర్కొన్నారు.