అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లు దేశీయ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తే ఆర్బిఐ తగిన విధాన చర్యలతో స్పందిస్తుందని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్లోత్రాతెలిపారు. ఫిక్కీ- ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబిఎ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎఫ్ఐబిఎసి 2025 వార్షిక బ్యాంకింగ్ సమావేశంలో మల్హోత్రా మాట్లాడుతూ ”మేము బ్యాంకింగ్ రంగానికి తగినంత నగదు లభ్యతను అందించాము. ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాలకు మద్దతును ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము. ఆర్బిఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే మరోవైపు ఆర్థిక వృద్ధిపై దృష్టి కోల్పోలేదు” అని చెప్పారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మల్హోత్ర ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ వద్ద ఇప్పటికే 695 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయని, ఇవి 11 నెలల విదేశీ వాణిజ్యానికి సరిపోతాయని తెలిపారు. సుంకాల మొత్తం ప్రభావం తక్కువగా ఉంటుందని మల్హోత్ర తెలిపారు. అయితే రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, దుస్తులు, ఎంఎస్ఎంఇ రంగాలపై కొంత ప్రభావం ఉండవచ్చని సూచించారు. ప్రభుత్వం ఉచిత వాణిజ్య ఒప్పందాలపై కూడా దృష్టి సారిస్తోందని చెబుతూ వృద్ధికి తమ వంతుగా ఇప్పటికే రెపోరేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించిందని గుర్తు చేశారు. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అంశాలను అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ రుణాలను విస్తరించేందుకు అవసరమైన చర్యలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల సైకిల్ను సృష్టించేందుకు వీలుగా కార్పొరేట్లు, బ్యాంక్లు ఓ తాటి పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడే దేశాభివృద్ధి ముందుకెళ్తుందని మల్హోత్ర అన్నారు. ధరల స్థిరీకరణ, ఆర్థికవృద్దే లక్ష్యంగా ద్రవ్య పరపతి విధానం కొనసాగుతుం దని తెలిపారు. స్థూలంగా భారత ఆర్థికవ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
More Stories
మెహుల్ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు
వత్తిడికి గురవుతున్న రూపాయికి అండగా ఆర్బీఐ
మునుపెన్నడూ లేనంతగా డిజిటల్ చెల్లింపులు