వేల సంవత్సరాల నాటి ఓ జంతువు అస్థిపంజరం

వేల సంవత్సరాల నాటి ఓ జంతువు అస్థిపంజరం
రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఫతేగఢ్ సమీపంలో ఒక అద్భుతం వెలుగులోకి వచ్చింది. వేల సంవత్సరాల నాటి ఓ జంతువు అస్థిపంజరం అక్కడ కనిపించింది. ఇది భారత శిలాజ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆగస్టు 21న మేఘా గ్రామం చెరువు వద్ద ఓ శిలాజం కనిపించింది. అక్కడి గ్రామస్థులు అది ప్రత్యేకమని అనుమానించి అధికారులకు సమాచారం అందించారు. 

అప్పుడు ఆవిష్కరణ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ్ దాస్ ఇన్ఖియా ప్రాథమిక పరిశీలన చేశారు. అది డైనోసార్ కాకుండా ‘ఫైటోసార్’ అనే ప్రాచీన సరీసృపదే అని తేల్చారు. ఇది సుమారు 201 మిలియన్ సంవత్సరాల నాటి జీవి అని చెప్పారు. పరిశోధన కోసం జోధ్‌పూర్ జేఎన్‌వీయూ విశ్వవిద్యాలయం బృందం రంగంలోకి దిగింది. డీన్ డాక్టర్ వి.ఎస్. పరిహార్ నేతృత్వంలో ఆ బృందం శిలాజాన్ని పరిశీలిస్తోంది.ఈ జీవి పరిమాణం సుమారు 1.5–2 మీటర్ల పొడవుతో ఉంటుంది. 

డాక్టర్ పరిహార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది మొసలిని పోలిన శరీర నిర్మాణం కలిగి ఉంది. ఇది డైనోసార్లకు మునుపటి కాలానికి చెందినది. ఈ శిలాజంలోని వెన్నెముకను పరిశీలించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక మొసలులతో పోలిన నిర్మాణ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం శిలాజం బయటపడిన ప్రదేశానికి చుట్టూ కంచె వేసారు. స్థానిక అధికారులు, శాస్త్రవేత్తల సహకారంతో అక్కడ పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆవిష్కరణపై దృష్టి సారించింది. సమగ్ర తవ్వకాలు, శాస్త్రీయ విశ్లేషణలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అస్థిపంజరం దాదాపు పూర్తి స్థాయిలో లభించడం ఇదే మొదటిసారి. ఇది భారత భూగర్భ చరిత్రలో గొప్ప మైలురాయిగా పరిగణించబడుతోంది. ఇది ఏకైక శిలాజం కాదు. ఇంతకముందు కూడా జైసల్మేర్ ప్రాంతంలో శిలాజాలు బయటపడ్డాయి. థాయియాత్ సమీపంలో డైనోసార్ పాదముద్రలు కనిపించాయి.

ఆకల్ గ్రామంలో 180 మిలియన్ సంవత్సరాల చెట్ల శిలాజాలు లభించాయి.ఆ శిలాజాలను వుడ్ ఫాసిల్ పార్క్‌లో భద్రపరిచారు. జేఠ్వాయ్ కొండ, థాయియాత్, లాఠీ ప్రాంతాలను ‘డైనోసార్ గ్రామాలు’ అని కూడా పిలుస్తారు.గతంలో జరిగిన మైనింగ్ వల్ల కొన్ని శిలాజాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం తవ్వకాలను నిలిపేసి, ప్రదేశాన్ని సంరక్షిస్తోంది.