
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వచ్చాయని చెబుతూ ఈసారి ప్రజలు బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ్ శుక్ల తెలిపారు. తెలంగాణ బీజేపీ నిర్వహించిన స్థానిక సంస్థల సోషల్ మీడియా – ఐటీ, సోషల్ మీడియా వర్క్షాప్లో ప్రసంగిస్తూ బాబ్రీ ఉద్యమం నుంచి రామమందిర నిర్మాణం వరకు తెలంగాణ కరసేవకులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు.
రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 50 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లి రాహుల్, ప్రియాంక మెప్పుకోసం పనిచేశారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వద్ద కోట్ల రూపాయల నగదు, 6 కేజీల బంగారం, విదేశీ కరెన్సీ బయటపడిందని పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఆఫీసులు గ్యాంబ్లింగ్ డెన్లుగా మారాయని మండిపడ్డారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో బిజెపిని బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కానీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసినది బిజెపి మాత్రమే అని స్పష్టం చేశారు.
దేశం వేగంగా ఎదుగుతుంటే, తెలంగాణ మాత్రం అప్పులు, నిధుల ఎగవేతలతో ఆర్థికంగా దివాళా తీసిందని విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కీలకం అని చెప్పారు. మీడియా అనేది శక్తివంతమైన వేదిక అని చెబుతూ ప్రతి ఉద్యమంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యం అని శుక్లా చెప్పారు.
స్థానిక యూట్యూబ్ చానెల్స్, స్థానిక మీడియా ప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగించాలని, నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని సూచించారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెబుతూ పత్రికలు, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియాను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని వివరించారు.
నిరంతరం ప్రజలతో, ముఖ్యంగా స్థానికంగా ప్రభావం చూపగల వ్యక్తులతో (ఉపాధ్యాయులు, డాక్టర్లు, మహిళా సంఘాల నాయకులు, మేధావులు) సత్సంబంధాలు కొనసాగించాలని, వారి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పారు. అధికారిక ప్రెస్ మీట్లలో వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలని హితవు చెప్పారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్