నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం

నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం
నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్​ల్లోకెక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో బాలకృష్ణను సత్కరించనున్నారు. 

యూకే గోల్డ్ ఎడిషన్​లో స్థానం కల్పించటం సంతోషంగా ఉందంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  కెరీర్​లో తండ్రి వారసత్వాన్ని కాపాడటంతోపాటు తన అద్భుత నటనతో, కళపట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్రవేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. సినిమాతోపాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషన్ కూడా ఈ ఏడాదే అందుకున్నారు.

1974లో తాతమ్మ కలతో బాలకృష్ణ సినీ జీవితం ప్రారంభమైంది. అలా 50 ఏళ్ల కెరీర్​లో బాలయ్య మంగమ్మగారి మనవడు, సీతారామకల్యాణం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్, శ్రీ రామరాజ్యం, అఖండ, భగవంత్ కేసరి క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌ అన్ని జాన్రాలలో నటుడిగా సత్తా చాటారు.

కెరీర్​లో అనేక విజయాలు అందుకున్నారు. ఇందులో బోయపాటి శ్రీనివాస్ తెరెక్కించిన లెజెండ్ సినిమా 1000కి పైగా రోజులు థియేటర్లలో ప్రదర్శితమై అరుదైన ఘతన సాధించింది. బాలకృష్ణ హీరోగా 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీసెంట్​గా నేషనల్ అవార్డ్ వరించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్​తో వచ్చింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్‌ నుంచి నేషనల్ అవార్డ్స్​లో బెస్ట్ ఫిల్మ్​గా ఎంపికైంది.

తన తండ్రికి అరుదైన గౌరవం దక్కటం పట్ల నారా బ్రహ్మణి ఎక్స్ వేదికగా సంతోషం ప్రకటించారు. ఆన్ స్క్రీన్​పై ఐకాన్​గా నిలవటంతోపాటు ఆఫ్ స్క్రీన్​లో గొప్ప లీడర్​గా ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు గ్లోబల్ గౌరవం దక్కటం సంతోషంగా ఉందంటూ బాలయ్యకు బ్రహ్మణి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. ఇటీవల బాలయ్య తన డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకున్నారు. 2021 బ్లాక్ బస్టర్ సినిమా అఖండకు సీక్వెల్​గా ఈ అఖండ తాండవం తెరకెక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది.