గాజాలో ‘కరువు’ నెలకొందనిప్రకటించిన ఐరాస

గాజాలో ‘కరువు’ నెలకొందనిప్రకటించిన ఐరాస

ఇజ్రాయిల్‌ అమానుష దాడులను ఎదుర్కొంటున్న గాజాలో ‘కరువు’ నెలకొందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోనే ఇది మొదటిదని, సుమారు 5,00,000 మంది ప్రజలు తీవ్రమైన ఆకలి విపత్తును ఎదుర్కొంటున్నారని నిపుణులు తెలిపారు. ఈ కరువు పూర్తిగా నివారించదగినదని ఐరాస సహాయ చీఫ్‌ టామ్‌ ప్లెచర్‌ పేర్కొన్నారు. 

ఇజ్రాయిల్‌ క్రమబద్ధమైన అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతుందని  తెలిపారు. పాలస్తీనా భూభాగంలో క్షీణిస్తున్న మానవతా పరిస్థితి గురించి యుఎన్‌ సంస్థలు గత కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాయి. ”ఆగస్ట్‌ 15 నాటికి గాజా గవర్నరేట్‌లో కరువు (ఐపిసి ఫేస్‌-5)ఉందని తగిన ఆధారాలతో నిర్థారించబడింది” అని రోమ్‌ ఆధారిత యుఎన్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఫేస్‌ క్లాసిఫికేషన్‌ (ఐపిసి) శుక్రవారం విడుదల చేసిన తాజా అప్‌డేట్‌లో పేర్కొంది. 

గాజాస్ట్రిప్‌లో గాజా నగరం సుమారు 20శాతం విస్తరించి ఉంది. సెప్టెంబర్‌ చివరి నాటికి కరువు డెయిర్‌ ఎల్‌-బాలా మరియు ఖాన్‌ యూనిస్‌ గవర్నరేట్లకు కూడా విస్తరిస్తుందని అంచనా వేయబడింది. ఇది పాలస్తీనా భూభాగంలో మూడింట రెండువంతుల వరకు ఉంటుంది. 22 నెలల నిరంతర యుద్ధం తర్వాత గాజా ప్రాంతంలో 5,00,000మందికి పైగా ప్రజలు ఆకలి, పేదరికం,  మరణం వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అని నివేదిక పేర్కొంది. 

జులై1 నుండి ఆగస్ట్‌ 15 మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంఖ్యను పేర్కొన్నామని, సెప్టెంబర్‌ చివరి నాటికి సుమారు 6,41,000 మందికి జనాభాలో సుమారు మూడింట ఒక వంతు పెరుగుతుందని అంచనా. ‘‘‘ఆకలి’ని విశ్లేషించడం ప్రారంభించినప్పటి నుండి గాజాస్ట్రిప్‌లో ఇది అత్యంత తీవ్రమైన క్షీణత ’’ అని ఐపిసి పేర్కొంది. 

ఇజ్రాయిల్‌ , హమాస్‌ మధ్య యుద్ధం పెరగడం, ఫలితంగా ప్రజలు స్థానభ్రంశం చెందడం, మానవతా, వాణిజ్య ఆహార సరఫరాల లభ్యతపై తీవ్రమైన పరిమితిలు ఈ పరిస్థితికి కారణమైందని పేర్కొంది. మార్చి ప్రారంభం నుండి ఇజ్రాయిల్‌ గాజాలోకి సాయాన్ని పూర్తిగా నిషేధించింది. మే చివరిలో తక్కువ పరిమితిలో సాయాన్ని అనుమతించింది. ఫలితంగా ఆహారం, మందులు మరియు ఇంధనానికి తీవ్రమైన కొరత ఏర్పడింది.