అనిల్‌ అంబానీ ఆఫీసుల్లో సీబీఐ సోదాలు

అనిల్‌ అంబానీ ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
 
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో షాక్‌ తగిలింది. మనీలాండరింగ్‌ ఆరోపణలతో అనిల్‌ అంబానీకి చెందిన సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సోదాలు చేపట్టింది. బ్యాంక్‌ మోసం కేసులో  రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)‌, అనిల్‌ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు శనివారం సోదాలు చేస్తున్నారు.
మనీ లాండరింగ్‌ ఆరోపణలతో సంబంధమున్న రూ.2,000 కోట్ల మోసపూరిత ఎస్బీఐ రుణం కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కాగా, 2017-19 మధ్య యస్‌ బ్యాంక్‌ నుంచి దాదాపు రూ.3 వేల కోట్ల రుణం తీసుకొని దారి మళ్లించారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గత నెల అనిల్‌ అంబానీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.

కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బిఐ) అనిల్‌ అంబానీని ఇప్పటికే ఫ్రాడ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐసహా ఆయా బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తాజా ఫైలింగ్‌నుబట్టి తెలుస్తున్నది.  అయితే ఈ నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో ఎస్బీఐ స్పష్టం చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్‌ నడుచుకున్నట్టు పేర్కొన్న బ్యాంక్‌ దీన్నో మోసపూరిత రుణంగా వర్గీకరించాలని తమ ఫ్రాడ్‌ ఐడెంటిఫికేషన్‌ కమిటీ తీర్మానించినట్టు తేల్చిచెప్పింది.  ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుకోవాలని, అలాగే రూ.12,692.31 కోట్లను కనెక్టెడ్‌ పార్టీల చెల్లింపులకు వినియోగించాలన్నది నిబంధన. కానీ 2016లో రుణ చెల్లింపులకు రూ.6,265.85 కోట్లను, కనెక్టెడ్‌ పార్టీలకు రూ.5,501.56 కోట్లనే ఇచ్చారని ఎస్బీఐ చెప్తున్నది. 

దేనా బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.250 కోట్ల రుణం, ఐఐఎఫ్‌సీఎల్‌ నుంచి పొందిన రూ.248 కోట్ల రుణాలకు సంబంధించి కూడా ఇదే అవకతవకల్ని గుర్తించినట్టు సమాచారం. కాగా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటిస్తే.. 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించాల్సి ఉంటుంది. అంతేగాక పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఫిర్యాదు చేయాలి.

ఈడీ జులై 24, 2025న ముంబై, ఢిల్లీలో 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, రిలయన్స్ గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, దేశం విడిచి వెళ్లకుండా నిషేధించింది.