తెలంగాణాలో రాజకీయ మార్పుకై యువతలో చైతన్యం

తెలంగాణాలో రాజకీయ మార్పుకై యువతలో చైతన్యం
తెలంగాణాలో మార్పు తీసుకు వచ్చేందుకు యువతలో చైతన్యం అవసరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపిచ్చారు. `పల్లె నిద్ర’ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల రూరల్ మండలంలో జరిపిన పెద్ద ఎత్తున జరిగిన యువ సంకల్ప సభలో పాల్గొంటూ రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. 
 
రాజకీయాల్లో యువత పాత్ర ఎప్పటికీ కీలకం అని చెబుతూ తెలంగాణ ఉద్యమంలోనూ యువత, విద్యార్థులు, న్యాయవాదుల పాత్ర మరువలేనిదని చెబుతూ ప్రపంచంలో ఏ ఉద్యమం అయినా యువకులే ముందుకు నడిచారు, నాంది పలికారని తెలిపారు. తెలంగాణాలో కూడా రాబోయే రోజుల్లో మార్పు తీసుకురావాల్సి ఉందని చెబుతూ కొన్ని రాజకీయ కుటుంబాలు తమ కుటుంబ పాలననే నడవాలని భావించి, ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టారని విమర్శించారు. 
 

అనేక ఏళ్లుగా అభివృద్ధి చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం వెనుకబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని యువత పరిస్థితి భయానకంగా మారిందని పేర్కొంటూ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. డ్రగ్స్ మాఫియా పెరిగిందని, శాంతి భద్రతల పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.

ఇటువంటి పరిస్థితుల్లో యువతను మంచి దారిలో తీసుకెళ్లే బాధ్యత బిజెపి యువమోర్చాకు ఉందని చెబుతూ మన లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించడం అని స్పష్టం చేశారు.  ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 1000 మంది యువత మార్పు కోసం సంకల్పం తీసుకొని పని చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వం రాకముందు, భారతదేశానికి ఒలింపిక్స్‌లో చాలా తక్కువ పతకాలు వచ్చేవని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహించి, భారత్‌ను విజయ పథంలో నిలిపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.

దేశ యువత జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ గివర్స్‌గా ఎదగాలని స్టార్టప్ ఇండియా, ముద్ర లోన్ వంటి పథకాలు ప్రారంభించారని చెప్పారు. అయితే,
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిందని, కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, లక్ష ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని పేర్కొంటూ నిరుద్యోగ భృతి ఎక్కడ? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు.

కాగా, చేవెళ్ల మండలం చన్ వల్లి గ్రామంలో రైతు సమ్మేళనంలో పాల్గొంటూ ఈ సారి తెలంగాణను పాలించే అవకాశం బిజెపికి ఇవ్వాలని రైతులను రాంచందర్ రావు కోరారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పంటలకు సాంకేతిక, ఆర్థిక మద్దతుతో పాటు, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. రైతుల గురించి ఆలోచించే పార్టీ బిజెపి, ఆలోచించే ప్రభుత్వం మోదీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.

“తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు, కాని ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. నిజమైన అభివృద్ధి కోసం, గొప్ప మార్పు కోసం ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ఈ సందర్భంగా పిలుపిచ్చారు.