జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే

జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే

* కేంద్రం ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం

వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం అంగీకరించింది. 12, 28 శాతం శ్లాబులు తొలగించి 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. మార్కెట్‌లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. 

అయితే, 5, 18శాతం స్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్‌లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది. 

ఆల్ట్రా లగ్జరీ, సిన్‌ గూడ్స్‌ (సిగరెట్లు వంటివి)పై 40 శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థికమంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా తెలిపారు. 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. 

ఇక స్టాండర్డ్‌ గూడ్స్‌పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్‌, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్‌పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్‌ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. 

అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా, ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు. ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది. జీఎస్టీ 2.0లో ఈ స్లాబును యథాతథంగానే ఉంచుతుండటం గమనార్హం. 

అంటే ప్రస్తుతం ఈ స్లాబులో ఉన్న వస్తూత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి ఢోకా లేదన్నమాట. ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపైనా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారో కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలు కొంటున్న 5 శాతం స్లాబులోని వస్తూత్పత్తులపై పన్ను భారం అలాగే ఉంటుంది.

ఇక పొగాకు, ఆన్‌లైన్‌ గేమింగ్స్‌, లగ్జరీ బైకులు, కార్లు ఇతర వస్తూత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ ఉండనే ఉంటున్నది. దీంతో కొత్త జీఎస్టీ విధానం వచ్చి పన్ను స్లాబులు తగ్గినా మొత్తం పన్ను భారం మాత్రం ఇప్పుడున్నట్టుగానే ఆయా కొనుగోలుదారులపై 88 శాతంగానే ఉంటుందన్న అంచనాలున్నాయి. 

దీంతో 12 శాతం, 28 శాతం స్లాబులను తీసేయడం వల్ల నష్టపోతున్న ఆదాయం అంతంత మాత్రమేనని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి జీఎస్టీ వసూళ్లలో ఇప్పుడు 12 శాతం స్లాబు ద్వారా 5 శాతం, 28 శాతం స్లాబు ద్వారా 11 శాతం ఆదాయమే వస్తున్నది. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనున్నది.