
* ట్రంప్ కు మాజీ ఐరాస రాయబారి నిక్కీ హేలీ హెచ్చరిక
గత 25 సంవత్సరాలుగా భారత్తో ఏర్పరచుకున్న సంబంధాలను అమెరికా వేగంగా ఆపివేస్తే అది వ్యూహాత్మక విపత్తు అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఐక్యరాజ్య సమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ హెచ్చరించారు. భారత్ను చైనాలాంటి ప్రత్యర్థిలా కాకుండా విలువైన స్వతంత్ర, ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలని ఆమె హితవు చెప్పారు.
భారత్, చైనా మధ్య బలమైన భాగస్వామ్యం చాలా సులభమని నిక్కీ హేలీ అభివర్ణించారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని, దాని పెరుగుదల స్వేచ్ఛా ప్రపంచానికి ముప్పే కాదని ఆమె స్పష్టం చేశారు. దీనికి విరుద్ధంగా చైనా కమ్యూనిస్ట్ పాలనలో నడుస్తున్నందున దాని పెరుగుతున్న శక్తి ఓ సవాల్గా మారుతుందని ఆమె వారించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా చైనా ఆంక్షలను తప్పించుకుంటుండగా మాస్కోకు అతిపెద్ద కస్టమర్ అని ఆమె గుర్తు చేశారు. అమెరికాకు భారత్ కీలకమైన మిత్రదేశంగా మారగలదని పేర్కొంటూ ఆసియాలో చైనాతో పోటీపడాలంటే ఈ సమతుల్యతను తీసుకువచ్చే ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా అర్థం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
చైనాలాగానే పెద్ద ఎత్తున వస్తువులను తయారు చేసే సామర్థ్యం భారత్కు ఉందని హేలీ పేర్కొన్నారు. అమెరికా తన సరఫరా గెలుసును చైనా నుంచి భారత్కు మార్చేందుకు సహాయపడుతుందని ఆమె సూచించారు. భారతదేశం దుస్తులు, చౌకైన ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయగలదని, వీటిని అమెరికా స్వయంగా వెంటనే, పెద్ద ఎత్తున తయారు చేయలేమని ఆమె తెలిపారు.
“భారత్ అనేది అమెరికాకు చైనా లాంటి విరోధి కాదు. అమెరికాతో సన్నిహితంగా ఉన్నందు వల్లే, రష్యాకు అతిపెద్ద ముడి చమురు కస్టమర్గా ఉన్నప్పటికీ భారత్పై సుంకాలు పడలేదు. చైనా, భారత్ మధ్యనున్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అమెరికా – భారత్ గత సంబంధాలను నిశితంగా పరిశీలించే అవకాశం లేకపోతే, ఇరుదేశాల నడుమ ఉన్న ఆర్థిక, సైనిక అనుబంధపు వాస్తవాలను తెలుసుకోవాలి” అని ఆమె హితవు చెప్పారు.
ముఖ్యంగా అమెరికా అక్కడ దళాల సంఖ్య, ఖర్చులను తగ్గించాలని కోరుకున్నప్పుడు భారతదేశం పెరుగుతున్న రక్షణ సామర్థ్యం, మధ్యప్రాచ్యంలో దాని పాత్ర ఆ ప్రాంతంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ముఖ్యమైనవని నిరూపించబడుతాయని అని చెప్పారు. భారత భౌగోళిక స్థానం చైనా వాణిజ్య, ఇంధన సరఫరా మార్గాలపై ఒత్తిడిని కలిగిస్తుందని, ఇది ఒక పెద్ద సంఘర్షణ విషయంలో చైనా ఆప్షన్ను తగ్గిస్తుందని ఆమె పేర్కొన్నారు.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో జపాన్ను దాటిపోతుందని నిక్కీ హేలీ గుర్తు చేశారు. చైనా ఎదుగుదలను భారత్ బలంగా మారుతున్న అడ్డుకోగలదని ఆమె స్పష్టం చేశారు. 2020 గాల్వన్ లోయ వివాదంతో సహా భారత్, చైనా మధ్య అనేక వివాదాలు ఉన్నాయని నిక్కీ హేలీ గుర్తు చేశారు.
అమెరికా భారతదేశం భాగస్వామి అయితే రెండు దేశాల ప్రయోజనాలు నెరవేరుతాయని, చైనాకు వ్యతిరేకంగా మరింత బలంగా నిలబడగలదని ఆమె పేర్కొన్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య వివాదం దీర్ఘకాలం కొనసాగితే అది పెద్ద, తప్పించుకోలేని తప్పు అవుతుందని, ఈ పరిస్థితిని చైనా సద్వినియోగం చేసుకోగలదంటూ హేలీ హెచ్చరించారు.
More Stories
`బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఫ్రాన్స్ లో పెద్దఎత్తున నిరసనలు
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం