విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి
* రాధాకృష్ణన్ ఎన్నికకు ప్రతిపక్షాల మద్దతుకై ప్రధాని మోదీ పిలుపు
ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు.  దేశంలోని ప్రముఖ, ప్రగతిశీల న్యాయవాదుల్లో సుదర్శన్ రెడ్డి ఒకరని, సుదీర్ఘమైన లీగల్ కెరీర్ కలిగి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడంలో విఖ్యాతి పొందారని ఖర్గే తెలిపారు. ఆయన పేదల పక్షపాతి అని, రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఎంతో పాటుపడ్డారని వివరించారు.
 
“ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకగ్రీవంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి దేశంలోనే ప్రఖ్యాత న్యాయవేత్తల్లో ఒకరు. న్యాయ రంగంలో ఆయనది సుదీర్ఘ ప్రస్థానం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విషయంలో ఎన్నో సాహసోపేతమైన, స్థిరమైన నిర్ణయాలు వెలువరించడంలో ఛాంపియన్‌గా నిలిచారు” అని ఖర్గే తెలిపారు.

జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. 1946 జులైలో జన్మించిన ఆయన, 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌ 27న బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 

1995 మే 2న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవ్వగా 2005లో గువాహటి హైకోర్టు సీజేగా పని చేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగాను సేవలందించిన ఆయన, 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టారు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. హైద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ బోర్టర్ ఆప్ ట్రస్ట్రీగా కూడా ఆయన సేవలందించారు.

అంతకుముందు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన ఎన్డీయే, ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌ చేసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం కానుంది.

అంతకు ముందు, దేశ ఉపరాష్ట్రపతి పదవికి గాను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపికైన బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఎన్టీఏ కూటమి ఎంపీల సమావేశంలో రాధాకృష్ణన్​ను మోదీ పరిచయం చేశారు. అనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు.

మోదీ తన ప్రసంగంలో వివిధ పార్టీలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు, రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూసుకోవడానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితాన్ని కొనియాడారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఎలాంటి వివాదాలకు లేదా కళంకాలకు దూరంగా సరళమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నిక మొత్తం దేశానికి ఆనందదాయకమైన విషయమని తెలిపారు.