కెప్టెన్‌గా సూర్య‌, వైస్ కెప్టెన్‌గా గిల్‌

కెప్టెన్‌గా సూర్య‌, వైస్ కెప్టెన్‌గా గిల్‌
ఆసియాక‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆ టోర్నీకి శుభ‌మ‌న్ గిల్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు.  ముంబైలో మంగళవారం స‌మావేశం అయిన బీసీసీఐ సెలెక్ట‌ర్ల బృందం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. మొత్తం 15 మంది ప్లేయ‌ర్ల బృందాన్ని వెల్ల‌డించారు.
అయ్య‌ర్, జైస్వాల్‌కు చోటు ద‌క్క‌లేదు. స్టాండ్ బై ప్లేయ‌ర్ల జాబితాలో కూడా శ్రేయాస్ అయ్య‌ర్ పేరు లేదు. ఈ టోర్నీ కోసం అయిదుగురు రిజ‌ర్వ్ ప్లేయ‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌సిద్ధ కృష్ణ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, జైస్వాల్‌, రియాన్ ప‌రాగ్‌, ద్రువ్ జురెల్‌.. రిజ‌ర్వ్ లిస్టులో ఉన్నారు. అయితే ఆ జాబితాలో కూడా శ్రేయాస్ అయ్య‌ర్ పేరు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సెప్టెంబ‌ర్ 10 తేదీన యూఏఈతో భారత్ మొదటి మ్యాచ్ ఆడ‌నున్న‌ది.
దుబాయ్ వేదిక‌గానే సెప్టెంబ‌ర్ 14వ తేదీన పాకిస్థాన్‌తో హైవోల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. ఇక 19వ తేదీన ఒమ‌న్‌తో చివ‌రి రౌండ్ మ్యాచ్ ఆడ‌నున్న‌ది. అయ్యర్‌కు ఎందుకు చోటు కల్పించలేదన్న ప్రశ్నించగా చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ యశస్వీ జైస్వాల్‌ విషయంలో ఇది దురదృష్టకమని వ్యాఖ్యానించాడు. అయ్యర్‌కు చోటు కోసం జట్టులో నుంచి ఎవరిని తప్పించాలని ప్రశ్నించాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదని, తమ తప్పు కూడా లేదని చెప్పుకొచ్చాడు. 

అయ్యర్, జైస్వాల్‌ జట్టులో తప్పనిసరి పరిస్థితుల్లో చోటు కోల్పోవాల్సి వచ్చిందని, యశస్వి జైస్వాల్ అవకాశం కోసం వేచి చూడడం దురదృష్టకరమని, అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన కనబరడంతో పాటు జట్టుకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందని చెప్పుకొచ్చారు. .

భార‌త జ‌ట్టు: సూర్య‌కుమార్ యాద‌వ్‌, గిల్‌, అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, బుమ్రా, హ‌ర్ష‌దీప్ సింగ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.