22న ట్రంప్‌, పుతిన్, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం?

22న ట్రంప్‌, పుతిన్, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం?

ట్రంప్‌-పుతిన్-జెలెన్‌స్కీల త్రైపాక్షిక సమావేశం ఈ నెల 22న ఉండనున్నట్టు తెలుస్తోంది. పుతిన్‌తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్‌ నాయకులతో ట్రంప్‌ చెప్పినట్లు అమెరికా మీడియా పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ట్రంప్‌తో భేటీ కానున్నారు.  ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను కూడా ట్రంప్‌ ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది.

అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్ చేశారు.  త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ప్రతిపాదనను జెలెన్‌స్కీ ముందుకు తీసుకురాగా ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పుతిన్‌తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్‌ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు తెలిపింది.

సోమవారం ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య సమావేశం జరిగిన అనంతరం ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.  రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం గురించి శనివారం అలాస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌ భేటీ అయ్యి రెండున్నర గంటలకు పైగా చర్చించారు. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందానికి రాలేదు.  అయితే, చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. 

సమావేశం గురించి మాట్లాడిన ట్రంప్‌ ఒప్పందంపై నిర్ణయం జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఉక్రెయిన్‌ అధినేత తెలిపారు. త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్‌ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు వెల్లడించారు.  కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదిక అవుతుందని పేర్కొంటూ పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

సోమవారం రోజు వాషింగ్టన్‌ డీసీలో ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశమవ్వనున్న నేపథ్యంలో ఐరోపా నేతలు అప్రమత్తమయ్యారు.  గతంలో ట్రంప్‌తో జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైన ఘటన నేపథ్యంలో అది పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రంప్‌తో స్నేహపూర్వకంగా మెలిగే ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌ను, ఇతరులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి సాయంగా వాషింగ్టన్‌కు పంపనున్నట్లు యూరప్‌ దౌత్యవేత్తలు తెలిపారు.