ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక

ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక

లోక్‌సభ సోమవారం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2025, ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025. అయితే, ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు లోక్ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకురావడంపై లోక్ సభ స్పీకర్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకుండా ఉండాలని కోరారు.  సభను ఉద్దేశించి బిర్లా మాట్లాడుతూ ‘మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలు అడిగితే, అది దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడకు పంపలేదు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసే అధికారం ఏ సభ్యునికీ లేదని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అదే సమయంలో హెచ్చరిస్తున్నాను’ అని స్పీకర్ స్పష్టం చేశారు.

ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే, తాను ‘నిర్ణయాత్మక నిర్ణయం’ తీసుకోవలసి ఉంటుందని స్పీకర్ హెచ్చరించారు. “మీరు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, నేను కొన్ని నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. దేశ ప్రజలు మిమ్మల్ని చూస్తారు. అనేక అసెంబ్లీలలో ఇటువంటి ఘటనలకు సభ్యులపై చర్యలు తీసుకున్నారు. నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడానికి ప్రయత్నించవద్దు. ఇది మీకు నా అభ్యర్థన” అని బిర్లా వారించారు.

సోమవారం సభ ప్రారంభం కాంగానే ముందుగా, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) సభ్యులు  త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా పార్లమెంటు ప్రాంగణంలో తమ నిరసనను కొనసాగించారు.   ఆదివారం ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలపై స్పష్టత ఇచ్చినప్పటికీ ఇండియా కూటమి సభ్యులు నిరసన కొనసాగిస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో స్పీకర్ పై విధంగా స్పందించారు.