సుప్రీంకోర్టు తొలిసారి ఓ సర్పంచ్ ఎన్నిక ఈవీఎం ఓట్ల లెక్కింపు!

సుప్రీంకోర్టు తొలిసారి ఓ సర్పంచ్ ఎన్నిక ఈవీఎం ఓట్ల లెక్కింపు!

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఇవిఎం) గురించి కొంతకాలంగా పలు వివాదాలు కొనసాగుతుండగా, మొదటిసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఓ సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఓట్ల రి కౌంటింగ్ జరిపించడం ఆసక్తి కలిగిస్తున్నది. హర్యానా సర్పంచ్‌ ఎన్నికల్లో  గోల్‌మాల్‌ వ్యవహారంలో అసాధారణరీతిలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓట్ల లెక్కింపు చేపట్టింది.  దీంతో ఫిర్యాదు చేసిన అభ్యర్థి మూడేళ్ల తర్వాత గెలుపొందారు.

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో బువానా లఖు గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమి చెందినా అయినా వెనక్కి తగ్గలేదు. తనకే విజయం దక్కుతుందనే నమ్మకంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలోనే ఇవిఎంలను తెరిచి కోర్టు లెక్కింపు చేపట్టగా, 51 ఓట్ల తేడాతో ఫిర్యాదు చేసిన అభ్యర్థి మోహిత్‌ మాలిక్‌ విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత అనుకూలంగా తీర్పు సాధించారు.

పానిపట్‌ జిల్లాలోని బువానా లఖు గ్రామంలో సర్పంచ్‌ పదవిపై ఎప్పటి నుంచో వివాదం ఉంది. మూడేళ్ల క్రితం 2022 నవంబర్‌ 2న సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అభ్యర్థి మోహిత్‌ మాలిక్‌ విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ కౌంటింగ్‌ జరగ్గా, మరో అభ్యర్థి కుల్దీప్‌ గెలిచారు.  అయితే ఓట్ల లెక్కింపులో ఏదో పొరపాటు జరిగిందని అప్పుడే మోహిత్‌ అనుమానించారు. వెంటనే అధికారులతో వారించినా, లాభం లేకుండా పోయింది.

బూత్‌ నంబర్‌ 69లో ఫలితాన్ని పొరపాటుగా మార్చారని మోహిత్‌ ఆరోపించారు. జిల్లా కోర్టులో పిటిషన్‌ వేసినా ఎలాంటి పురగోతి లేదు. హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.  దీంతో సుప్రీంకోర్టును కొన్నాళ్ల క్రితం ఆశ్రయించారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోర్టుకు ఈవిఎంలను తెప్పించింది. ఓట్లను మళ్లీ లెక్కించింది. అప్పుడు మోహిత్‌ మాలిక్‌ 51 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించింది.

అంతేకాదు జిల్లా యంత్రాంగం రెండు రోజుల్లోపు మోహిత్‌తో సర్పంచ్‌ ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశించింది.  దీంతో అధికారులు మోహిత్‌ మాలిక్తో ప్రమాణం చేయించారు. తద్వారా ఆయన సర్పంచ్‌ అయ్యారు. అయితే సుప్రీంకోర్టులో ఈవిఎంలను తెరిచి, ఓట్లను మళ్లీ లెక్కించడం దేశంలోనే తొలిసారి. ఈ వ్యవహారం దేశంలో ప్రస్తుతం ఓటు చోరీ, ఇవిఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలకు చేయూత ఇచ్చినట్లయింది.