ఓట్ల చోరీ అంటూ ప్రచారం రాజ్యాంగాన్ని అవమానించడమే!

ఓట్ల చోరీ అంటూ ప్రచారం రాజ్యాంగాన్ని అవమానించడమే!
 
ఓట్ల చోరీ అంటూ ప్రచారం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారాల పట్ల మేం ఏమాత్రం భయపడమని, ఎన్ని ఆరోపణలు వచ్చినా తాము పని చేసుకుంటూ వెళ్తామని స్పష్టం చేశారు.  బిహార్ ఓటర్ల జాబితాలోని లోపాలను తొలగించడమే లక్ష్యంగా ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ’ (ఎస్​ఐఆర్​) చేపట్టామని తెలిపారు. 
 
కొన్ని పార్టీలు దాని గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బిహార్​లో ఓటు చోరీకి వ్యతిరేకంగా ‘ఓటర్ ఆధికార్ యాత్ర’ చేపట్టిన నేపథ్యంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన గణాంకాలు లేని పీపీటీని చూపించినంత మాత్రాన అబద్ధం నిజం కాదని, ఆధారాలు అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ అఫిడవిట్‌ ఇవ్వాలని, లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని, ఇందులో మూడో మార్గం లేదని హెచ్చరించారు. ఏడురోజుల్లో అఫిడవిట్‌ ఇవ్వకపోతే ఆరోపణలు నిరాధారంగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు.

“కొన్ని పార్టీలు, వాటి నాయకుడులు బిహార్ ఎస్​ఐఆర్​ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. బిహార్ ముసాయిదా ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలు, అభ్యంతరాలను వ్యక్తం చేయాలని ఈసీ కోరుతోంది. దీనికి ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఎన్నికల కమిషన్ తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయి” అని చెప్పారు. 

“బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు అందరూ అత్యంత పారదర్శకంగా కలిసి పనిచేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపదు. పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండింటినీ ఎన్నికల కమిషన్ సమానంగా చూస్తుంది. 45 రోజుల్లో ఎలాంటి ఎన్నికల పిటిషన్లు వేయకుండా, కేవలం ఓటు చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తుండడం రాజ్యాంగాన్ని అవమానించడమే”అని తెలిపారు. 

గత రెండు దశాబ్దాలుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అందు కోసమే ఎన్నికల సంఘం బిహార్‌ నుంచి ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను ప్రారంభించిందని చెప్పారు. సర్‌ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 1.6 లక్షల మంది బీఎల్‌ఏలు కలిసి ముసాయిదా జాబితాను సిద్ధం చేశారని వివరించారు

కాగా, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌ లోని ససారం నగరంలో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ను ప్రారంభించారు. ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బీహార్‌లో ఓట్ల తొలగింపు, చేర్పుల లాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. అయితే ఆ కుట్రను ఇండియా కూటమి కచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పారు.