
జమ్ముకశ్మీర్ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ వారం జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా 60మందికి పైగా మరణించగా, 100మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. జాంగ్లోట్లోని ఒక గ్రామంలో శనివారం అర్థరాత్రి క్లౌడ్బరెస్ట్తో మెరుపు వరదలు సంభవించాయి.
జిల్లా వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కథువా జిల్లా సమాచార కేంద్రం హెచ్చరించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది. వరదల కారణంగా నదుల, వాగుల్లో నీటి ప్రవాహం వేగంగా పెరిగే అవకాశం ఉందని, వర్షాలకు కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షపాతం కారణంగా నదుల్లో ప్రవాహం గణనీయంగా పెరిగిందని, ఉజ్ నది ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ తుపాను కారణంగా రైల్వేట్రాక్, జాతీయ రహదారి 44, పోలీస్ స్టేషన్ దెబ్బతిన్నాయని ఉధంపూర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పోలీసులు, సైన్యం, పారామిలటరీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఎక్స్లో పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. జిల్లా ఎస్పీ శోభిత్ సక్సేనాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరాతీశారు.
ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. కథువా జిల్లాలో సహాయ రక్షణ మరియు తరలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కథువాలోని జోద్ఖాడ్, జుతానాతో సహా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వలన ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.
More Stories
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ
ఇద్దరు ఉగ్రవాదులు, ముగ్గురు మావోయిస్టులు హతం