
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన అదనపు సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. ఇలాంటి రాజకీయ నిర్ణయాలు ఉన్నప్పటికీ, భారత్పై తమ “పాజిటివ్” అవుట్లుక్ కొనసాగుతుందని సంస్థ పేర్కొంది. భారత్కు సంబంధించిన ఓ వెబినార్లో ఎస్&పి డైరెక్టర్ యీఫార్న్ ఫువా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత జీడీపీ వృద్ధిలో అమెరికాకు చేసే ఎగుమతుల ప్రాధాన్యత తక్కువేనని ఫువా తెలిపారు. అవి మొత్తం జీడీపీలో కేవలం 2 శాతం మాత్రమేనని చెప్పారు. ఈ కారణంగా, కొత్తగా విధించిన సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని వివరించారు. ఫార్మా, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇది భారత వ్యాపారవర్గానికి కొంత ఊరట ఇచ్చింది. దీంతో ఎగుమతులపై వెంటనే పెద్ద అడ్డంకి ఏర్పడదని భావిస్తున్నారు.
“ప్రభుత్వం పెట్టుబడి ఆధారిత వృద్ధిపై, వ్యవసాయ రంగ సంస్కరణలపై కూడా చాలా దృష్టి సారించింది. అయితే, మహమ్మారి తర్వాత గత మూడు సంవత్సరాలలో నిజమైన వృద్ధి సగటున 8.3 శాతంగా ఉన్న తరువాత భారతదేశంలో ఆర్థిక విస్తరణ మరింత స్థిరమైన స్థాయికి సాధారణీకరించబడటం ఆశ్చర్యకరంగా ఉందని మేము భావిస్తున్నాము” అని చెప్పారు.
“ప్రస్తుతం, వినియోగదారుల వ్యయం, ప్రభుత్వ పెట్టుబడులు రాబోయే రెండు సంవత్సరాలలో వాస్తవ జిడిపి వృద్ధిని 6.7 నుండి 6.8 శాతం వద్ద నిర్వహిస్తాయని మేము అంచనా వేస్తున్నాము. ఈ వృద్ధి రేట్లు, మునుపటి కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, భారతదేశాన్ని ఇలాంటి ఆదాయ స్థాయిలలో సార్వభౌమ సహచరుల కంటే పైన ఉంచుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను కోతలు ఉన్నప్పటికీ ఇది ఆర్థిక ఆదాయ వృద్ధికి మద్దతు ఇస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని ఫువా వివరించారు.
ట్రంప్ ప్రకటించిన తాజా 25% సుంకాలు, ఇప్పటికే ఉన్న సుంకాలతో కలిపితే మొత్తం 50 శాతం అవుతాయి. అయితే, దీర్ఘకాలంలో ఇవి పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. అందుకే భారత్ రేటింగ్ను ‘బిబిబి-’ స్థాయిలో ‘పాజిటివ్ అవుట్లుక్’తో కొనసాగిస్తున్నామని పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది.
ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యమైన 4.8 శాతం, 4.4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుందని ఎస్ & పి విశ్వసిస్తోంది. “ఈ లక్ష్యాలు వాస్తవానికి మా అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుతానికి, కనీస పన్ను విధించదగిన ఆదాయ పరిమితిని ఎత్తివేయడం వల్ల వచ్చే ఆదాయ నష్టం, నెమ్మదిగా ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారతదేశం తన ఆర్థిక లోటు లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుందని మార్కెట్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి” అని తెలిపింది.
గత సంవత్సరం ఇదే స్థాయిలో వృద్ధి నమోదవడంతో, ఈ ఏడాది కూడా అదే స్థిరత కొనసాగుతుందని విశ్లేషించింది. చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలన్న అంతర్జాతీయ వ్యూహంతో అనేక కంపెనీలు భారత్ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ కంపెనీలు ప్రధానంగా భారత మార్కెట్కే వస్తున్నాయని, ఎగుమతులకే కాదు అని ఎస్ అండ్ పీ పేర్కొంది. ఇది దేశీయ పరిశ్రమల పెరుగుదలకు బలంగా నిలుస్తుంది.
ప్రస్తుతం అమెరికా, భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం. 2024-25లో రెండు దేశాల మధ్య వాణిజ్యం $186 బిలియన్కి చేరింది. ఇందులో భారత్ అమెరికాకు చేసిన ఎగుమతులు $86.5 బిలియన్లు. దిగుమతులు $45.3 బిలియన్లుగా నమోదయ్యాయి. అమెరికా టారిఫ్లు రాజకీయ ఒత్తిడి కోణంలో వచ్చినా, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. ఎస్ అండ్ పీ విశ్లేషణ ప్రకారం, దీర్ఘకాలంలో ప్రభావం తక్కువే.భారత్ అంతర్గతంగా బలపడుతున్న మార్కెట్తో, వృద్ధి పటిష్టంగా కొనసాగనుంది.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం