పౌరసత్వం పొందక ముందే ఓటర్ల జాబితాలో సోనియా 

పౌరసత్వం పొందక ముందే ఓటర్ల జాబితాలో సోనియా 

ఎన్నికల కమిషన్‌తో బీజేపీ గత ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారవేస్తున్న బీజేపీ కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నో మోసాలకు పాల్పడిందని ఆరోపించింది. కాంగ్రెస్‌ సినీయర్‌ నేత సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు ఎలా కల్పించారో చెప్పాలని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ప్రశ్నించారు. 

భారత ఓటర్ల జాబితాతో సోనియా గాంధీ పేరు చేర్చి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని మాలవీయ ఆరోపించారు. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు.  భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందు ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని, అప్పటికి ఆమె ఇటాలియన్ అని ఆయన గుర్తు చేశారు.

ఆ సమయంలో ఓటర్ల జాబితాలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీలతో పాటు సోనియా గాంధీ పేరు కూడా చేర్చారని చెప్పారు.  ఆ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవ్వడంతో పేరును తొలగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 1983 జనవరిలో తిరిగి చేర్చారని తెలిపారు. ఆ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం మంజూరయ్యిందని వెల్లడించారు. ఆ విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపించారు. 

పౌరసత్వం లేని సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చి ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిందని అన్న మాలవీయ, దీనిపై కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, భారత పౌరురాలు కావడానికి ఒక సంవత్సరం ముందు సోనియా పేరు జాబితాలో చేర్చారని మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

అయితే మాలవీయ ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. సోనియా గాంధీ తన పేరును ఓటరు జాబితాలో చేర్చమని అడగలేదని, అలా చేసింది తాము కాదని, అప్పటి పోల్స్ బాడీ అధికారులేనని కాంగ్రెస్ ప్రతినిధి తారిఖ్ అన్వర్ తెలిపారు. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ, ఒక రాజ్యాంగ సంస్థ, సొంత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు ఆ సంస్థ బీజేపీ నుంచి బయటకు వచ్చి పనిచేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.