శిల్పా శెట్టి దంపతులపై రూ 60 కోట్ల మోసం కేసు

శిల్పా శెట్టి దంపతులపై రూ 60 కోట్ల మోసం కేసు
ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి మోసం చేశారంటూ బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి దంపతులపై గురువారం కేసు నమోదైంది. దీపక్‌ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ  కేసు ప్రస్తుతం నిర్వహణలో లేని బెస్ట్‌ డీల్‌ టివి ప్రై.లి కోసం రుణం, పెట్టుబడి ఒప్పందానికి సంబంధించినది.
2015- 2023 మధ్య వ్యాపార విస్తరణ కోసం తాను వారికి రూ.60.48 కోట్లు ఇచ్చానని, కానీ వారు ఆ రుణాన్ని వ్యక్తిగత ఖర్చులకోసం వినియోగించారని ముంబయి వ్యాపారవేత్త దీపక్‌ కొఠారీ ఫిర్యాదు చేశారు.  2015లో రాజేష్‌ ఆర్య అనే ఏజెంట్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలో శిల్పాశెట్టి, కుంద్రాలు బెస్ట్‌ డీల్‌ టివి సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. సంస్థలో శిల్పాశెట్టికి 87 శాతం కంటే అధిక వాటాలను కలిగి ఉన్నారు. 
 
సంస్థ కోసం ఏడాదికి 12 శాతం వడ్డీతో రూ.75  కోట్ల రుణం కోరారని, పన్నులను నివారించేందుకు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా మార్చారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని తనకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిందని వివరించారు.