ఏపీతో సహా దేశంలో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులు

ఏపీతో సహా దేశంలో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులు
 
ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులకు దాదాపు రూ.4,594 కోట్లు ఖర్చు చేయనుండగా, ఒడిశా, పంజాబ్‌, ఏపీలో ప్రారంభించనున్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.18,541 కోట్ల విలువైన పథకాలకు ఆమోదం తెలిపారు.
 
రూ.5,801 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లక్నో మెట్రో ఫేజ్ వన్ బీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌ సిగల్న్‌ ఇచ్చింది. అలాగే, రూ.8,146 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్లీన్ గ్రోత్: టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టును సైతం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 700 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తవుతుంది.  భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని  కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
సీసెమ్,  కాంటినెంటల్ డివైసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిడిఐఎల్), 3డి గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ఏఎస్ఐపి) టెక్నాలజీస్‌కు సంబంధించినవని చెప్పారు.  ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.4,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో 2,034 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టులతో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎకో సిస్టమ్‌కు ఊతం లభిస్తుందని, అదే సమయంలో పరోక్షంగా ఉద్యోగాలు కూడా సృష్టిస్తాయని పేర్కొన్నారు.  దేశంలో ప్రస్తుతం ఐఎస్‌ఎం కింద మొత్తం పది ప్రాజెక్టులను ఆమోదించినట్లు వెల్లడించారు. గతంలో ఆరు రాష్ట్రాల్లో సుమారు రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. లక్నో మెట్రో రైలు ప్రాజెక్ట్-1బీని సైతం ఆమోదించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో 12 స్టేషన్లతో 11.165 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. 

మెట్రో రైలు నెట్‌వర్క్‌ను 34 కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళిక ఉందని చెప్పారు. అమీనాబాద్, యాహియాగంజ్, పాండేగంజ్ తదితర వాణిజ్య కేంద్రాలు, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (మెడికల్ కాలేజ్), ఇమాంబర, చోటా ఇమాంబర, భూల్ భూలైయా, ఘంటాఘర్, రూమి దర్వాజా ప్రాంతాలను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధామవుతామని వివరించారు. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.5,801 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 700 మెగావాట్ల టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.8146.21 కోట్లు ఖర్చవుతుందని, 72 నెలల కాలంలో పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు 2738.06 ఎంయు శక్తిని ఉత్పత్తి చేసే 700 ఎండబ్ల్యు (4 x 175 ఎండబ్ల్యు) సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా నిర్వహిస్తాయని పేర్కొన్నారు.