రైల్వే రిటర్న్ టికెట్‌పై 20% రాయితీ

రైల్వే  రిటర్న్ టికెట్‌పై 20% రాయితీ
రాబోయే ఫెస్టివల్‌ రష్‌ ను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్ కింద రిటర్న్ టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ప్రవేశపెట్టింది. పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, సౌకర్యాలను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన్నట్లు రైల్వే శాఖ శనివారం ప్రకటించింది.
 
వినాయక చవితి, దీపావళి, దసరా తదితర పండగలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక పనినిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సొంతూళ్లకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. దీంతో పండగల సీజన్‌లో రైళ్లు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించే ఉద్దేశంతో భారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్‌తో ప్రయాణికుల ముందుకు వచ్చింది.

రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం 2025 ఆగస్టు 14వ తేదీ నుంచి రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ స్కీమ్ అమల్లోకి రానుంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ మధ్య స్వస్థలాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్యలో తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకోవాలి. 

ఆన్ లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైల్వే బుకింగ్ వెబ్‌సైట్‌లోని ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ ద్వారా ప్రయాణికులు ఈ స్కీమ్‌ను ఉపయోగించకోవచ్చు. అయితే, వెళ్లడానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం ఒకేలా ఉండాలి. రెండు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయితే డిస్కౌంట్ వస్తుంది.

ఈ పథకం కింద రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌ చేసేటప్పుడు సాధారణంగా ఉండే 60 రోజుల ముందస్తు రిజర్వేషన్‌ కాలపరిమితి (ఏఆర్‌పీ) వర్తించదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. 20% రాయితీ తిరుగు ప్రయాణం ప్రాథమిక ఛార్జీపై మాత్రమే ఉంటుంది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు కూడా ఉండదు. అలాగే, టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. ఇక ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా అన్ని రైళ్లకు, అన్ని క్లాసులు, ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తిస్తుంది.