రాహుల్‌ భారత వ్యతిరేక మనస్తత్వం వెల్లడి

రాహుల్‌ భారత వ్యతిరేక మనస్తత్వం వెల్లడి
కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించడంతో ఆయన భారత వ్యతిరేక మనస్తత్వం వెల్లడయిందని బిజెపి నాయకులు ధ్వజమెత్తారు.  సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందని రాహుల్‌ చేసిన ప్రకటన దేశానికి హానికరమని, మన సాయుధ దళాల నైతికతను తగ్గిస్తుందని విమర్శించారు. 
 
ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు చేయొద్దని రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నా తమ మాట వినడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కనీసం సుప్రీంకోర్టు హెచ్చరించినందుకు సంతోషంగా ఉన్నానని చెప్పారు.  రాహుల్ గాంధీ భారత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మండిపడ్డారు.
 
 సైన్యం ధైర్య సాహసాలు ప్రదర్శించి చైనా సైన్యాన్ని వెనక్కి పంపిస్తే చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో 2వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం సరికాదని హితవు చెప్పారు. నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కోర్టు అనడం రాహుల్‌ గాంధీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయనని చెప్పారు. 
 
కాంగ్రెస్‌ నాయకుడిగా ఎంత పరిణితి చెందిన వారని ఆయన ప్రశ్నించారు. చైనా సైన్యం ఆక్రమించిన రాహుల్ గాంధీ భారత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టడం ఇదే తొలిసారి కాదని విమర్శించారు.