క్యూఆర్‌ కోడ్‌తో ఈ-ఆధార్‌!

క్యూఆర్‌ కోడ్‌తో ఈ-ఆధార్‌!
 
* రెస్టారెంట్లలో ఫిర్యాదులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్యూఆర్‌ కోడ్‌
 

ఈ ఏడాది చివరి నాటికి క్యూఆర్‌ కోడ్‌తో ఈ-ఆధార్‌ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రయత్నిస్తున్నది. దీనివల్ల ప్రజలు తమ గుర్తింపును డిజిటల్‌ స్కాన్‌ ద్వారా తనిఖీ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది అమల్లోకి వస్తే, జిరాక్స్‌ కాపీలు, పత్రాలను ఉపయోగించవలసిన అవసరం ఉండదు. ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు సేవల కోసం క్యూఆర్‌ కోడ్‌తో తమ గుర్తింపును ధ్రువీకరించుకోవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష ఆధార్‌ ఆథెంటికేషన్‌ మెషిన్స్‌ పని చేస్తున్నాయని యూఐడీఏఐ సీఈఓ భువనేశ్‌ కుమార్‌ చెప్పారు. వీటిలో దాదాపు 2,000 మెషిన్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్లు తెలిపారు. ఆధార్‌ మొబైల్‌ యాప్‌ను కూడా రీడిజైన్‌ చేస్తున్నారు. ఆధార్‌ హోల్డర్‌ తన పేరు, చిరునామా, జనన తేదీ, వంటి ప్రొఫైల్‌ అప్‌డేట్స్‌ను తన ఫోన్‌లోని ఈ యాప్‌ ద్వారానే చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు.

మరోవంక, దేశంలోని రెస్ట్టారెంట్లు, కేఫ్‌లు, ధాబాలు, రోడ్డుపక్కన ఆహారం విక్రయించే దుకాణాలు సహా ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్స్‌ (ఎఫ్‌బీవో)లు తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ యాప్‌కు కనెక్ట్‌ చేసే క్యూఆర్‌ కోడ్‌తోపాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ లేదంటే తమ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. 

 
వినియోగదారులకు సాధికారత కల్పించడం, ఆహార భద్రత, పరిశుభ్రత, తప్పుదారి పట్టించే ఉత్పత్తి లేబుళ్ల గురించి ఫిర్యాదులు దాఖలు చేయడాన్ని సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.  దీనిని బట్టి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో భాగమైన క్యూఆర్‌ కోడ్‌ను తప్పనిసరిగా వినియోగదారులకు కనిపించే ప్రదేశాలైన బిల్లింగ్‌ కౌంటర్‌, డైనింగ్‌ సెక్షన్‌లో ఉంచాలి. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.యాప్‌ ద్వారా ఒకసారి ఫిర్యాదు చేశాక వేగవంతమైన పరిష్కారం కోసం అది నేరుగా సరైన అధికారికి చేరుతుంది.