నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు

నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు

 కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు పెట్టినట్టు ఆదివారం వచ్చిన ఓ బెదిరింపు కాల్, మహారాష్ట్ర నాగ్‌పూర్పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మంత్రిగారి ఇంట్లో బాంబు పెట్టినట్టు చెప్పడంతో, పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయింది.  గడ్కరీ నాగ్ పూర్ నివాసాన్ని పేల్చేస్తామంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఆదివారం ఉదయం 8.46 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది.

వార్దా రోడ్డులోని గడ్కరీ ఇల్లు పేల్చేస్తామని సమాచారం రావడంతో పోలీసులు స్థానిక ప్రతాప్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.   పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఇంటి లోపల, బయటి ప్రాంగణంలో అత్యంత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి మూలను జల్లెడ పట్టినా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు ధృవీకరించారు. 

ఆ తర్వాత కొద్దిసేపటికే బెదిరింపు కాల్ చేసిన అనుమానితుని అరెస్టు చేశారు. అతనిని ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించారు.  తుల్సి బాగ్ రోడ్డులో ఉంటున్న రౌత్ మెడికల్ చౌక్ సమీపంలోని స్థానిక సారా దుకాణంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. తన మొబైల్ నెంబర్‌ నుంచి అతను ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో గడ్కరీ నివాసం పేల్చేస్తామని బెదరించాడు. నాగ్ పూర్‌లోని బీమా దవాఖానా సమీపంలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చినప్పుడు గడ్కరీ నాగ్ పూర్‌లోనే ఉన్నారు. ఆయన క్షేమంగానే ఉన్నారని, అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మంత్రి నివాసం వద్ద గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.  ఉదయం 9 గంటలకు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు గడ్కరీ ఇంటి వద్ద బాంబు పెట్టామని, అది పేలడానికి సిద్ధంగా ఉందని ఒక ఫోన్ వచ్చిందని, వెంటనే బాంబు స్క్వాడ్‌ను అక్కడికి పంపడంతోపాటు మంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ అప్రమత్తం చేశామని జోన్-1 డీసీపీ రిషీకేష్ రెడ్డి తెలిపారు. 

గడ్కరీ నివాసంలో ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపేనని తేలినట్టు చెప్పారు. పట్టుబడిన నిందితుడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, అతని ఫోన్ నుంచి కాల్ రావడంతో అరెస్టు చేసి మరింత సమాచారం రాబడుతున్నామని వివరించారు.