
భారత ఎన్నికల సంఘం బీహార్ లో సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు తెలిపింది. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలోని తప్పులను సరి చేయడం కోసం నెలరోజుల పాటు ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ (ఎస్ఐఆర్) కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం నాడు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం ఓటర్ల జాబితాను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను అప్డేట్ చేయడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం వంటి పనులు చేప్టింది.
రాష్ట్రంలో నమోదైన 7.89 కోట్ల మంది ఓటర్లలో 91.69 శాతం మంది అంటే, సుమారుగా 7.24 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఎస్ఐఆర్ కార్యక్రమం తర్వాత విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించారు. వీరిలో చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు పొందిన వారు ఉన్నారని, వారందరి ఓట్లను తొలగించినట్లుగా భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మూసాయిదా జాబితాపై ఓటర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1 వరకు గడువిచ్చింది.
అలానే అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఓటర్ జాబితాలో లేకపోతే వారి పేర్లను తిరిగి చేర్చడానికి అవకాశం కల్పించింది. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసేందుకు అర్హతలేని ఎంట్రీలను తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
2024 జూలై 1 నాటికి లేదా అంతకన్నా ముందే 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు, అలాగే 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఫారమ్ 6, డిక్లరేషన్ ఫారమ్ ఉపయోగించి ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని తెలిపింది. అన్ని అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా