
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల వరుసగా ఆపరేషన్లు చేపట్టి.. ఉగ్రవాదులను మట్టుబెడుతుంది భారత సైన్యం. తాజాగా ఆపరేషన్ అఖల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున మరో ఉగ్రవాదిని భారత బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
దీనికి సంబంధించిన వివరాలను భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ వివరాలు అందించింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. రాత్రి నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మరింత ధీటుగా బదులిస్తన్న సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపిందని చినార్ కార్ప్స్ ఎక్స్ లో తెలిపింది. ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ అఖల్ కొనసాగుతోందని వివరించింది.
దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అఖల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించింది. దీన్ని గమనించిన ఉగ్రవాదులు సైన్యం పైకి కాల్పులు చేయడం ప్రారంభించాయి. ఉగ్రవాదులకు ధీటుగానే భారత్ సైన్యం బదులిచ్చింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి) పాల్గొన్నాయి.
ఉగ్రవాదిని హతమార్చినప్పటికీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని భారత సైన్యం చినార్ కార్ప్స్ తెలిపింది. హతమైన ఉగ్రవాది గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు. వీళ్లంతా లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వీరి కోసం గాలిస్తున్న సైన్యంపై కాల్పులు జరుపుతున్నారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా