కంగనా రనౌత్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

కంగనా రనౌత్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బటిండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ పరువు నష్టం దావా రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద అభియోగాలు మోపారని, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వు చట్టబద్ధమైనదని జస్టిస్ త్రిభువన్ దహియా సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. 
 
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంపై ఆమె చేసిన ట్వీట్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. కంగనా చేసిన రీట్వీట్‌లో బటిండాకు చెందిన మహిందర్‌ కౌర్‌ ఫొటో అందులో ఉన్నది. ఢిల్లీ షాహిన్‌బాగ్‌ నిరసన తెలుపుతున్న మహిళలో లింక్‌ చేయడంపై తన పరువు భంగం కలిగించారని ఆమె కోర్టును ఆశ్రయించారు.  దాంతో కోర్టు పరువు నష్టం కేసులో కంగనాకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది. 
 
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కంగనా రనౌత్‌ మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియ మేరకు మేజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేశారని హైకోర్టు పేర్కొంది. ట్వీట్‌లో ఆమె ఉద్దేశమేమీ తప్పు కాదని, సరిగ్గానే ట్వీట్‌ చేసిందని కంగనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించినా కోర్టు అంగీకరించలేదు. 
 
కంగనా ఆ ట్వీట్‌ చేయలేదని, కేవలం రీట్వీట్‌ చేసిందని, అందులో గౌతమ్‌ యాదవ్‌ పేరును చేర్చలేదని, కంగనాపై మాత్రమే పిటిషన్‌ దాఖలైందంటూ చేసిన వాదనలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు 2021 రైతు ఉద్యమం సమయంలో కంగనా ఈ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో మహిందర్ కౌర్ అనే 87 ఏళ్ల వృద్ధ మహిళ రూ.200 తీసుకుని ఆందోళనకు వచ్చినట్లుగా కంగనా ట్వీట్‌ చేశారు.