జులైలో 7.5 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకుజీఎస్టీ

జులైలో 7.5 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకుజీఎస్టీ
గత సంవత్సరం జులైతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 7.5 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీలు, దిగుమతుల వృద్ధి ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. 2025 ఏప్రిల్ నుంచి జులై వరకు మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 8.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.  గత ఏడాది ఇదే కాలంలో రూ. 7.39 లక్షల కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే 10.7 శాతం వృద్ధి నమోదైందని గణాంకాలు సూచిస్తున్నాయి. 
జులై నెలలో సెంట్రల్ జీఎస్టీ రూ. 35,470 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 44,059 కోట్లు వసూలయ్యాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 1,03,536 కోట్లు, సెస్ రూ. 12,670 కోట్లు అందింది. జులైలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరినా, ఈ ఏడాది మొదటి త్రైమాసిక సగటు రూ. 2.1 లక్షల కోట్లతో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్‌లో రూ. 2.37 లక్షల కోట్లు, మేలో రూ. 2.01 లక్షల కోట్లు వసూలయ్యాయి.

రీఫండ్‌లు పెరగడం జులై నికర ఆదాయంపై ప్రభావం చూపింది. రీఫండ్‌ల తర్వాత జులై నికర జీఎస్టీ ఆదాయం రూ. 1,68,588 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం 1.7 శాతం మాత్రమే పెరిగింది. రీఫండ్‌లు రూ. 27,147 కోట్లకు పెరగడం ఇందుకు కారణమైంది. ఏప్రిల్ నుంచి జులై వరకు నికర జీఎస్టీ ఆదాయం 8.4 శాతం పెరిగి రూ. 7.11 లక్షల కోట్లకు చేరింది. త్రిపురా 41 శాతం, మేఘాలయ 26 శాతం వృద్ధి సాధించాయి.

మధ్యప్రదేశ్ 18 శాతం, బీహార్ 16 శాతం, ఆంధ్రప్రదేశ్ 14 శాతం పెరిగాయి. మహారాష్ట్ర రూ. 30,590 కోట్లతో 6 శాతం వృద్ధి నమోదు చేసింది.  కర్ణాటక 7 శాతం, తమిళనాడు 8 శాతం, గుజరాత్ 3 శాతం వృద్ధి సాధించాయి. మణిపూర్‌లో 36 శాతం, మిజోరంలో 21 శాతం వసూళ్లు తగ్గాయి. జులైలో తయారీ రంగం 16 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊపిరి నింపిందని నిపుణులు చెబుతున్నారు.