పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత వారం రిలయన్స్ గ్రూప్తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని దాదాపు 35 చోట్ల ఈడీ దాడులు జరిగాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. 2017-19 మధ్య యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ దాదాపు రూ.3 వేల కోట్ల రుణం తీసుకొని దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ ఆరోపణలు.
ఈ కేసులో అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కూడా విచారిస్తున్నారు. దాదాపు 50 సంస్థలు, 25 మందిపై కేసులు నమోదైనట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనిల్ అంబానీని ఇప్పటికే ఫ్రాడ్గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐసహా ఆయా బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తాజా ఫైలింగ్నుబట్టి తెలుస్తున్నది.
అయితే ఈ నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని ఆర్కామ్కు పంపిన లేఖలో ఎస్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్కామ్ నడుచుకున్నట్టు పేర్కొన్న బ్యాంక్.. దీన్నో మోసపూరిత రుణంగా వర్గీకరించాలని తమ ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ తీర్మానించినట్టు తేల్చిచెప్పింది. ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుకోవాలని, అలాగే రూ.12,692.31 కోట్లను కనెక్టెడ్ పార్టీల చెల్లింపులకు వినియోగించాలన్నది నిబంధన.
కానీ 2016లో రుణ చెల్లింపులకు రూ.6,265.85 కోట్లను, కనెక్టెడ్ పార్టీలకు రూ.5,501.56 కోట్లనే ఇచ్చారని ఎస్బీఐ చెప్తున్నది. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.250 కోట్ల రుణం, ఐఐఎఫ్సీఎల్ నుంచి పొందిన రూ.248 కోట్ల రుణాలకు సంబంధించి కూడా ఇదే అవకతవకల్ని గుర్తించినట్టు సమాచారం. కాగా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటిస్తే.. 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించాల్సి ఉంటుంది. అంతేగాక పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఫిర్యాదు చేయాలి.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!