పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటాం

పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటాం
కాంగ్రెస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ఇచ్చేసిందని, కానీ బీజేపీ దానిని తిరిగి భారత్ లో చేరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందిందని ఆయన విమర్శించారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే, ఉగ్రవాదులపై చర్య తీసుకునే బదులు పత్రాలను పంపి ఉండేదని ఆయన ఆరోపించారు.
 
రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కాంగ్రెస్ కు జాతీయ భద్రత కంటే రాజకీయాలే ముఖ్యమైపోయాని అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ సంతృప్తి పడుతోందని ఆయన దుయ్యబట్టారు. భారత్లో ఉగ్రవాదం పూర్తిగా అంతరించే దిశలో ఉందని, అది కచ్చితంగా అంతం అవుతుందని అమిత్ షా తెలిపారు. 
 
హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కాలేరని, ఈ విషయాన్ని ప్రపంచానికి గర్వంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబా హస్తం ఉందని అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి అంతం చేసిన ముగ్గురు ఉగ్రవాదులు ఆ ఉగ్రసంస్థకు చెందినవారేనని స్పష్టం చేశారు. 
వాస్తవానికి పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల తలపై కాల్చి చంపాలని ప్రజలు కోరుకున్నారని, యాదృచ్ఛికంగా ఆ ముగ్గురు ఉగ్రవాదులను మన బలగాలు తలపైనే గురిచూసి కాల్చాయని ఆయన రాజ్యసభలో చెప్పారు. మహిళలు, పిల్లల ముందు మతం అడిగి మరీ చంపేశారని, ఇంత అనాగరిక నేరం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు అమిత్ షా మాట్లాడడం ప్రారంభించగానే ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశాయి. కానీ సభాధ్యక్షులు విపక్షాల డిమాండ్ను అంగీకరించలేదు. దీంతో వారు వాకౌట్ చేశారు. అమిత్షా ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర హోం మంత్రి చిదంబరంపై విమర్శలు గుప్పించారు.

“చిదంబరం నా రాజీనామా కోరారు. పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందినవారని రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆపరేషన్ సిందూర్ సమర్థతను కూడా చిదంబరం సవాల్ చేశారు. అంటే కాంగ్రెస్ కు జాతీయ భద్రత కన్నా రాజకీయాలు ముఖ్యం. అది ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయింది” అని ఆరోపించారు. 

“కాంగ్రెస్ మనస్తత్వాన్ని చిదంబరం ప్రపంచానికి బహిర్గతం చేశారు. ఓటు బ్యాంకు కోసం వారు పాకిస్తాన్, లష్కరే తోయిబాతో సహా ఉగ్రవాదులు అందరికీ మద్దతు ఇస్తారు” అని అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్ ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరు పెట్టడాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ను అమిత్ షా ఎద్దేవా చేశారు.

“శివాజీ మహారాజ్ మొఘలులపై పోరాడినప్పుడు, ఆయన యుద్ధ నినాదం హరహర మహాదేవ్. వాస్తవానికి భారతీయ సైనికులు వివిధ యుద్ధ నినాదాలు మతాలపై ఆధారపడి ఉంటాయి. అయితే వాటికి హిందూ, ముస్లింలతో సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.  “ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మన సీఆర్పీఎఫ్, సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు చాలా కృషి చేశారు. కష్టతరమైన భూభాగంలో ఉంటూ, డ్రోన్ల ద్వారా పంపే ఆహారాన్ని తిన్నారు. ఇలా ఉగ్రవాదులను వెంబడించి వారికి తుదముట్టించారు.” అని రాజ్యసభలో అమిత్ షా చెప్పారు.