ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు సుప్రీం 3 నెలల గడువు

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు సుప్రీం 3 నెలల గడువు
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదని జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అయితే, న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

2023 నవంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, డాక్టర్‌ సంజయ్‌పై కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

 
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌ స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోటవంతో తెలంగాణ హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. వీరితో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో మొత్తం తొమ్మిది సార్లు విచారణ చేపట్టింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరడమే ఈ పిటిషన్ల ప్రధాన ఉద్దేశ్యం. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. 

 
కేసులో ప్రతివాదులుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చారు. ఈ మేరకు ఇరు పక్షాల వాదనల అనంతరం నేడు సుప్రీం ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్లపై 3 నెలల్లోగా అంటే అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు డెడ్‌లైన్ విధించింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.