కర్ణాటక కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది

కర్ణాటక కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది

కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నట్లుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కలహాలను ఎదుర్కొంటోందని, పార్టీ రెండు వర్గాలగా విడిపోయిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పుడు ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయారని, పార్టీలో భారీ గొడవ జరుగుతోందని విమర్శించారు. 

ఈ దీపావళికి కాంగ్రెస్‌లో పెద్ద ఊహించని ఘటన జరుగుతుందని ఆయన జోష్యం చెప్పారు. తాము ముందు నుంచీ చెబుతున్నామని విజయేంద్ర పేర్కొంటూ మనకు వస్తున్న వార్తలు కాంగ్రెస్ పార్టీలో అంతా బాగాలేదని స్పష్టంగా చెబుతున్నాయని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవచ్చు కానీ కాంగ్రెస్ అంతర్గత యుద్ధం ఇప్పుడే మొదలవుతుందని పేర్కొన్నారు. 

అభివృద్ధి పనుల విషయంలో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై ఆగ్రహంగా ఉన్నారని విజయంద్ర తెలిపారు.  కొంతమంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌ను సీఎంగా చేయాలని కోరుకుంటున్నారని, మరికొందరు ఏసీసీఐ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కోరుకుంటున్నారని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యనే కొనసాగాలని అంటున్నారని వివరించారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని స్పష్టం చేస్తూ ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు సీఎం తమ ప్రాంతాల్లో రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రకటించారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని గుర్తు చేశారు. గత కొంతకాలంగా కర్నాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పీఠం మార్పులు వార్తలు వస్తున్నాయి. 

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సిద్ధరామయ్య సమావేశాలు నిర్వహిస్తుండగా, వీటికి డీకేను పక్కనబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల నిమిత్తం ఇటీవలే ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల చొప్పున సీఎం సిద్ధరామయ్య నిధులు కేటాయించారు. 

తాజాగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు డీకే దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో జరుగుతాయి. అయితే ఈసారి విధాన సౌధలో సీఎం చాంబర్‌లో జరుగుతుండటం గమనార్హం. డీకేను దూరం పెట్టేందుకే ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారన్న ప్రచారం సాగుతోంది.