మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పుపై బిజెపి హర్షం 

మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పుపై బిజెపి హర్షం 
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్ఐఏ కోర్టు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు హర్షం ప్రకటించారు.  అప్పట్లో దేశ భద్రతకు, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని పేర్కొంటూ ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
 
మాలేగావ్ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన స్వాగతించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు స్పీకర్ మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పడం మంచి పరిణామం అని తెలిపారు.

తెలంగాణ స్పీకర్  కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా నిర్ణయం తీసుకోవాలని రామచందర్ రావు కోరారు. గతంలో రాజీవ్ గాంధీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేశారని, అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను లాక్కొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “జనహిత పాదయాత్ర” వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడమా అనేది కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.  గత ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెబుతూ ఇదెలా జనహితమవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.  ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, డిక్లరేషన్ల అమలుపై ఎంత మేరకు నెరవేరాయో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అప్పుడే వారికి పాదయాత్ర చేయగల నైతిక హక్కు ఉంటుందని స్పష్టం చేసారు.