తక్షణ కాల్పుల విరమణకు థాయ్‌- కంబోడియా అంగీకారం

తక్షణ కాల్పుల విరమణకు థాయ్‌- కంబోడియా అంగీకారం
థాయ్‌ లాండ్‌, కంబోడియా మధ్య గత ఐదురోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్ని ఘర్షణలకు తెరపడినట్లయింది. రెండు దేశాలూ తక్షణ, బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మలేషియా  ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం ప్రకటించారు.
 
ఇరు దేశాలు తక్షణమే, బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించాయని మలేషియా ప్రధాని ఇన్వర్ ఇబ్రహీం తెలిపారు. ఏసియాన్ ప్రాంతీయ కూటమికి అధిపతిగా ఉన్న అన్వర్, ఇరుదేశాల మధ్య చర్చలకు అధ్యక్షత వహించారు. సరిహద్దు వివాదాన్ని ముగించి, సాధారణ స్థితికి తిరిగి రావడమే లక్ష్యంగా థాయ్, కంబోడియా నేతలతో సమావేశం నిర్వహించారు.
 
తాజాగా ఆ చర్చలు ఫలించి ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విలేకరుల ఎదుట థాయ్, కంబోడియా ప్రధానులు, అన్వర్ సమక్షంలో కరచాలనం చేశారు. “కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక పీఎం పుమ్తాత్ వెచాయాచాయ్ జులై 28 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చే తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు అంగీకరించారు”  అని వెల్లడించారు.

రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంలో మలేషియా మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాలు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలే ప్రకటించారు.  ఈ సరిహద్దు వివాదాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలపై ఒత్తిడి తెచ్చారు.

ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీం ఆహ్వానం మేరకు సోమవారం మలేషియాలోని పుత్రజయలో జరిగిన చర్చలకు కంబోడియా ప్రధాన మంత్రి హున్‌ మానెట్‌, థాయ్‌లాండ్‌ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్‌ వెచాయాచాయ్‌ హాజరయ్యారు. మలేషియాలోని చైనా, అమెరికా రాయబారులతో కలిసి మలేషియా ప్రధాని ఇబ్రహీం నివాసంలో చర్చలు జరిగాయి. 

థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య గురువారం నుంచి ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 35 మందికి పైగా మరణించారు. 1.65 మంది నిరాశ్రయులయ్యారు.  ఘర్షణ పడుతున్న రెండు దేశాలతోపాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్‌కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది.

థాయిలాండ్, కంబోడియా ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని పైకి చెబుతున్నా, సరిహద్దుల్లోని హిందూ దేవాలయాల కోసమే ఇరుదేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్‌ విహార్‌, ట మోన్‌ థోమ్‌, ట మ్యూన్‌ థోమ్‌ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దలుగా ఇరుదేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి.