
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే శీనానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. దసరా మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారని తెలిపారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు 11 రోజులపాటు 11 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 22వ తేదీన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
23వ తేదీన శ్రీ గాయత్రీ దేవి, 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 25వ తేదీన శ్రీ కాత్యాయని దేవి, 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీ దేవి, 27వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 28వ తేదీన శ్రీమహా చండీ దేవి, 29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్దినీ దేవి, అక్టోబర్ 2న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని వివరించారు.
మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందని తెలిపారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామని, ప్రతిరోజు నగరోత్సవం జరుగుతాయని శివ ప్రసాద్ శర్మ వివరించారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ