జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మగుడి కూల్చివేత అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి ఏటా బోనాల పండుగను నిర్వహించుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందువులంటే అంత చులకనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 
 
త్వరలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది కాబట్టి ఆ నియోజకవర్గంలో 30 శాతం ఓట్లున్న ఒక వర్గం వారిని సంతృప్తిపరిచేందుకు పెద్దమ్మ గుడిని కూల్చినట్లు అర్ధమవుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బిజెపి అత్యధిక స్థానాలు గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఎందుకంటే గ్రామాల్లో నిధులు ఎవరిస్తున్నారు? కేంద్రమే ఇస్తోంది కదా? మరి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి? ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.

కాగా, కామారెడ్డి బిసి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది బిసి డిక్లరేషన్ కాదని ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 27 శాతం రిజర్వేషన్లు బిసిలకు అమలవుతున్నాయని, అదనంగా బిసిలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు న్నారని సంజయ్ కుమార్ ఆరోపించారు.

అంటే తెలంగాణలో వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతోందని మండిపడ్డారు. అట్లాంటప్పుడు అది బిసి డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని స్పష్టం చేశారు. బిసి జాబితా నుండి ముస్లింలను తొలగించేదాకా ఆ బిల్లును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బిసిలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతిచ్చి బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్ల గేట్లను బద్దలు కొట్టడం ద్వారా హిందుత్వాన్ని దెబ్బకొడతామంటూ మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పత్రికల్లో చూసి హిందువులంటే ఎంత ద్వేషమో ఆయన మాటల్లోనే అర్ధమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఎపి బిజెపి ఎంపి సిఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్ధమని చెబుతున్న కేటిఆర్ అందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. “నేను సవాల్ చేస్తున్నా. .వేదికను ఏర్పాటు చేస్తా..సిఎం రమేశ్‌ను తీసుకొస్తా. ఆధారాలతో సహా వివరిస్తా. డేట్, టైం ఫిక్స్ చెయ్… దమ్ముంటే చర్చకు రా” అని నిలదీశారు.