
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న అభ్యంతరాల పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ దేశం కూడా తమ సొంత ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగించలేదని యూకేలోని భారత్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తేల్చి చెప్పారు. బ్రిటన్ రేడియో స్టేషన్ ‘టైమ్స్ రేడియో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు వినియోగదారులుగా ఉందని గుర్తు చేశారు.
దేశ అవసరాల్లో 80శాతం వరకు దిగుమతుల మీదే ఆధారపడుతున్నామని చెబుతూ అలాంటప్పుడు రష్యా నుంచి అతి తక్కువ ధరకే వస్తున్న చమురును కొనుగోలు చేయకుండా ఎలా ఉంటామని దొరైస్వామి ప్రశ్నించారు. భారత్ ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారని పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఆయన నిలదీసేరు. మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాలా? అని ప్రశ్నించారు.
అలాగే రష్యాతో భారత్కు బంధం ఇప్పటిది కాదని హైకమిషనర్ దొరైస్వామి గుర్తు చేశారు. “గతంలో కొన్ని పశ్చిమదేశాలు భారత్కు ఆయుధాలు విక్రయించకుండా చేశారు. అలాగే మాపై దాడి చేసిన పొరుగు దేశాలకు ఆయుధాలు అమ్మిన విషయాలు గుర్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లోనూ రష్యా మాతో సత్సంబంధాలు కొనసాగించింది” అని తెలిపారు. “కొన్ని దేశాల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని మాకు సూచనలు చేస్తున్నారు. అలా చెప్పినవారే ఆయా దేశాలతో తమ సొంత ప్రయోజనాల కోసం అరుదైన ఖనిజాలు, చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వారి నిజాయతీని ప్రశ్నించమంటారా?” అని విక్రమ్ దొరైస్వామి ఘాటుగా స్పందించారు.
More Stories
2026 నాటికి భారత్ కు ఎస్-400 డెలివరీ పూర్తి
పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
ఉద్యోగ భద్రత కోసమే హెచ్-1బి వీసాల పై ట్రంప్ కన్నెర్ర