ఆపరేషన్ సిందూర్ పై ఎన్‌సిఇఆర్‌టి ప్రత్యేక మాడ్యూల్

ఆపరేషన్ సిందూర్ పై ఎన్‌సిఇఆర్‌టి ప్రత్యేక మాడ్యూల్
పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ ఆపరేషన్ సిందూర్ పై పాఠాలు రూపొందిస్తోంది. భారతదేశ రక్షణ భారతదేశ సైనిక శక్తి, వ్యూహం, దౌత్య ప్రతిస్పందనల గురించి విద్యార్థులు తెలుసుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్పై మాడ్యూల్ రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మాడ్యూల్ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి మాడ్యూల్ 3 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రూపొందిస్తున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం మరొక మాడ్యూల్ తయారు చేస్తోంది ఎన్సీఈఆర్టీ.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ వ్యూహాత్మక సైనిక ప్రతిస్పందనపై దృష్టి సారించింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్ను మరోసారి ఓడించింది. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక మాడ్యూల్ ద్వారా విద్యార్థులకు ఈ విషయాలు తెలుస్తాయని సదరు వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) రూపొందిస్తున్న ఆపరేషన్ సిందూర్ మాడ్యూల్ 8 నుంచి 10 పేజీల వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దేశాలు ఉగ్రవాద ముప్పులకు ఎలా స్పందిస్తాయో, జాతీయ భద్రతలో రక్షణ, దౌత్యం, మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో విద్యార్థులకు అర్థం అయ్యేలా చెప్పడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక మాడ్యూల్ రూపొందిస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకాల్లో ఆపరేషన్ సిందూర్తోపాటు భారతదేశ విభజన నాటి భయానక పరిస్థితులు, పర్యావరణ స్పృహతో కూడిన భారతీయ జీవనశైలి గురించి పాఠాలు ఉండనున్నాయి. అలాగే ఇండియా ప్రధాన అంతరిక్ష శక్తిగా ఎలా ఎదిగింది, అంతరిక్ష రంగంలో చంద్రయాన్ నుంచి ఆదిత్య ఎల్1 వరకు భారత్ సాధించిన విజయాలు గురించి, ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లివచ్చిన మొదటి భారతీయుడు సుభాన్షు శుక్లా గురించి కూడా పాఠాలు రూపొందిస్తోంది ఎన్సీఈఆర్టీ.

పాఠశాలల్లో భద్రతా ఆడిట్

కాగా, పాఠశాలల్లోని పిల్లల భద్రతా యంత్రాంగం, సౌకర్యాల ఆడిట్లను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ విద్యా మంతిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల భవన నిర్మాణాల పటిష్టతను కూడా నిర్ధరించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల కూలిపోయి ఏడుగురు పిల్లలు మరణించగా, 28 గాయపడ్డారు. 

ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భద్రత, శ్రేయస్సుల కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో శిక్షణ ఇవ్వాలని, కౌన్సిలింగ్, పీర్ నెట్వర్క్ల ద్వారా మానసిక సామాజిక మద్దతు ఇవ్వాలని సూచించింది.