నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ కొట్టివేత

నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ కొట్టివేత

ఏపీ, తెలంగాణలలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్  ధర్మాసనం తుది ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో పిటిషనర్‌ కోరారు.

జమ్ముకశ్మీర్‌లో పునర్విభజన చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. దీనికి సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ 170(3) అధికరణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని తెలిపింది. 2026లో మొదటి జన గణన (జనాభా లెక్కలు) అనంతరం మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. 

ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని, గేట్లు తెరిచినట్లు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్‌కు (నియోజకవర్గాల పునర్విభజన) సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.

జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి సారించారన్న పిటిషనర్‌ వాదనను  సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జమ్మూకశ్మీర్ కోసం జారీ చేసిన డీలిమిటేషన్ నోటిఫికేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మినహాయించడం ఏకపక్షం, వివక్ష కాదని స్పష్టం చెప్తూ పురుషోత్తం రెడ్డి పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను కొత్త జనసంఖ్యకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తారు.

2027లో జనగణన ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆ సమాచారం ఆధారంగా లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేసే అవకాశం ఉంది.  ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది. ప్రతి పార్లమెంట్ సభ్యుడు లేదా ఎమ్మెల్యే దాదాపు ఒకే సంఖ్యలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించేలా ఈ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. 

భారత రాజ్యాంగం ప్రకారం ప్రతీ జనగణన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ 1976 నుంచి ఈ తరహా ప్రక్రియను ఆపేశారు. దీనికి కారణం అప్పట్లో ప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రోత్సహించాలని భావించడమే. అధిక జనన రేటు కలిగిన రాష్ట్రాలు ఎక్కువగా ఉత్తరాదిలో ఉన్నాయి.