రష్యాకు చెందిన ఏఎన్-24 విమానం రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయి చైనా సరిహద్దుల్లోని తూర్పు ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 49 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. తొలుత విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా, కాసేపటి క్రితమే కూలిపోయిందని అధికారులు నిర్ధరించారు.
రష్యన్ వార్తా కథనాల ప్రకారం, గురువారం తెల్లవారుజామున 49 మంది ప్రయాణికులతో అంగారా ఎయిర్లైన్స్కు చెందిన ఏఎన్-24 ప్యాసింజెర్ విమానం ఇవాళ ఉదయం బ్లాగోవెష్చెన్స్క్ నుంచి చైనా శివారు ప్రాంతం టైండా పట్టణానికి బయల్దేరింది. విమానం తొలుత అదృశ్యమయ్యింది. మరికొద్దిసేపట్లో ల్యాండింగ్ అయ్యే సమయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో విమనానికి సంబంధాలు తెగిపోయాయి.
దీంతో అప్రమత్తమైన యంత్రాంగం వెంటనే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. అదృశ్యమైన కొద్దిసేపటికే రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ విమానం “కాలిపోతున్న ఫ్యూజ్లేజ్”ను కనుగొన్నట్లు తెలిపింది. అయితే ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు 15 కిలోమీటర్లు దూరంలో ఉండగా కూలిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
చైనా సరిహద్దుల్లోని టిండా విమానాశ్రయానికి చేరువలోనే విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు సిబ్బందితో సహా 43 మంది ప్రమాణికులు ఉన్నారని రష్యన్ మీడియా కథనాలు తెలిపాయి. సహాయ చర్యల కోసం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కాగా, ఘటనాస్ధలంలో భారీగా మంటలు చెలరేగాయి.
రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహయక చర్యల్లో పాల్గొన్నారు. విమానం తొలుత ల్యాండింగ్కు ప్రయత్నించగా అది విఫలం కాగా, మరోసారి ల్యాండింగ్ చేసేటపుడు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా వార్తా కథనం ఒకటి ప్రకటించింది. ఘటనాస్థలిలో విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పైలట్ తప్పిందం, ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడమే ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో, ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న రాబిన్సన్ ఆర్66 హెలికాప్టర్ ఇదే అమూర్ ప్రాంతంలో అదృశ్యమైంది. ఈ ప్రాంతం మాస్కోకు తూర్పున దాదాపు 6,600 కి.మీ దూరంలో ఉంది.

More Stories
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
రూ.500తో మహిళలకు 40 నిమిషాల ఆన్లైన్ ఉగ్రవాద శిక్షణ
ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై క్రెమ్లిన్ అభ్యంతరాలు