
“ఒకవైపు భారత్ పరిణతి చెందిన ప్రజాస్వామ్యం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సమ్మిళిత సమాజం వైపునకు దూసుకెళ్తోంది. మరోవైపు పాకిస్థాన్ ఉన్మాదం, ఉగ్రవాదంలో మునిగిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి వరుసగా అప్పులు తెచ్చుకుంటోంది” అంటూ ఎద్దేవా చేశారు. “సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పొరుగువారి స్ఫూర్తిని, అంతర్జాతీయ సంబంధాలను ఉల్లంఘించే దేశాలకు తీవ్రమైన జరిమానాలు వేయాలి. అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని విధానాలను పాటిస్తూ, యూఎన్ కౌన్సిల్ సభ్యుడు ఇషాక్ దార్ ధర్మోపదేశం చేయడం తగదు” అని హరీశ్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం నిలిపేసే వరకు 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు చెప్పారు. పాక్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ను భారత్ చేపట్టిందని హరీశ్ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినవారు, దానికి ఆర్థిక సహాయం చేసినవారు, స్పాన్సర్లను జవాబుదారీగా ఉంచి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అభ్యర్థన మేరకే భారత్ సైనిక కార్యకలాపాలను నిలిపివేసిందని గుర్తు చేశారు. “పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి ఏర్పాటై 80ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో యూఎన్ చార్టర్ లో పొందుపరచిన బహుపాక్షికత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఎంతవరకు సాకారం అయ్యాయో ఆలోచించుకోవాలి” అని సూచించారు.
“ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత మొదటి నాలుగు దశాబ్దాలు వలసరాజ్యాల నిర్మూలన, ప్రచ్ఛన్న యుద్ధాన్ని చూసింది. దేశాల మధ్య వివాదాలు, సంఘర్షణలను అడ్డుకోవడంలో యూఎన్ పాత్ర కీలకం. వాస్తవానికి 1988లో యూఎన్ శాంతి పరిరక్షక దళాలకు నోబెల్ బహుమతి లభించింది” అని తెలిపారు.
“అయితే, ఇటీవల కాలంలో సంఘర్షణలు, యుద్ధాల స్వభావం మారిపోయింది. సరిహద్దుల వెలుపల నిధులు, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల శిక్షణ, రాడికల్ భావజాల వ్యాప్తి, ఆధునిక డిజిటల్, కమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇరు పార్టీలు ఒప్పుకోవాలి” అని పర్వతనేని హరీశ్ తేల్చి చెప్పారు.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి