ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. రానున్న రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించనుందని సంబంధిత వర్గాలు బుధవారం ప్రకటించాయి. జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో అవసరాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్ట్‌ చివరి నాటికి కొత్త ఉపరాష్ట్రపతిని నియమించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 

జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాను హోంశాఖ అధికారికంగా కమిషన్‌కు తెలిపిన వెంటనే సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆ వర్గాలు తెలిపాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని, నోటిఫికేషన్‌ జారీ అయిన 14 రోజుల్లోపు నామినేషన్‌ పత్రాలను సమర్పించాల్సి వుందని పేర్కొన్నాయి. 1952 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌, లెక్కింపుతో సహా ఎన్నికల ప్రక్రియను గరిష్టంగా 32 రోజుల్లో పూర్తి చేయాల్సి వుంది.

దీంతో ఆగస్ట్‌ చివరి నాటికి ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. మరో రెండు సంవత్సరాల పదవీకాలం ఉండగా అనూహ్యంగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 68(2) ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాల్సి ఉంది.

ఉప రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 వివరిస్తుంది. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎలక్టోరల్‌ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులతోపాటు, నామినేటెడ్‌ సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు.

 
ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య పద్ధతిలో పరోక్ష విధానంలో ఎన్నుకుంటారు. కాగా, ఎలక్టోరల్‌ కాలేజీలో ఖాళీలు ఉన్నాయనే కారణంతో ఎన్నికను వాయిదా వేయడానికి ఉండదు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 5 ఏళ్లు పదవిలో ఉంటారు. పదవీ కాలపరిమితి పూర్తయిన ఉపరాష్ట్రపతి, కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించే వరకు పదవిలో ఉంటారు