కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు కురు వృద్ధుడు వి.ఎస్‌. అచ్యుతానందన్‌ కన్నుమూశారు. గత నెల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసున్న అచ్యుతానందన్‌, 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

1923 అక్టోబర్ 20న కేరళలో జన్మించిన అచ్యుతానందన్‌ ఏడుసార్లు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మూడుసార్లు కేరళ విపక్షనేతగా వ్యవహరించారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్‌ కూడా ఒకరు. కేరళ రాజకీయ చరిత్రలో కీలక నేత అయిన అచ్యుతానందన్‌ దేశంలో అత్యంత గౌరవనీయ క‌మ్యూనిస్టు నేతల్లో ఒకరిగా పేరుగాంచారు.  1980 నుండి 1991 వరకు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.

కార్మికుల హక్కులు, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. లెనిన్‌, స్టాలిన్‌, మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేశారు అచ్యుతానందన్‌. ఆ తర్వాత దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ జీవనం సాగించారు.

కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టి 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకెళ్లటంతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరింది.  1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి, సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అవినీతికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎన్నడూ వెనకంజ వేయని అచ్యుతానందన్‌, రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపైనా సీఎంగా ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలతో అనేకమంది వ్యతిరేకమైనా ఆయన వెనుకడగు వేయలేదు. ప్రజలు, పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు మార్క్సిస్టు పార్టీ క్రమశిక్షణనూ పక్కనబెట్టి ప్రజల పక్షాన నిలబడటానికే పెద్దపీట వేశారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తన నిజాయితీబాటను, నిరాడంబరతను ఏనాడూ ఆయన విడిచిపెట్టలేదు.

1923లో పుట్టినా ఆధునిక అవసరాలను కూడా అర్థం చేసుకున్న నిత్య అధ్యయనశీలి అచ్యుతానందన్‌.  పాతతరంలో భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైనట్లుగా, సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించిన ఆయన, అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ కోసం ఉద్యమాలు చేశారు.