ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (74) తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వైద్యల సుచనలతో తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనానా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. తన రాజీనామా రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం అమలులోకి వస్తుందని లేఖలో ధనఖడ్ రాసుకొచ్చారు.
పార్లమెంట్ వర్షాకాల ప్రారంభమైన మొదటిరోజే ఈ అనూహ్య పరిణామం జరగడం గమనార్హం. వాస్తవానికి తన రాజీనామా లేఖను సోమవారం ఉదయమే రాష్ట్రపతికి పంపాలని అనుకున్నారు. పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు రాజ్యసభలో ఐదుగురు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం వల్ల ఆయన సాయంత్రం రాజీనామా లేఖను సమర్పించారు. 
 
ఉపరాష్ట్రపతిగా తనకు అచంచలమైన మద్దతు ఇచ్చి సహకరించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రిమండలికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సహకారం, మద్దతు అమూల్యమైనవిగా రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. తన పదవీకాలంలో చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహకారం తనకు ఎంతో విలువైందని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
గతంలో ధన్‌ఖర్ మాట్లాడుతూ ‘భగవంతుడు ఆశీర్వదిస్తే 2027 ఆగస్టులో పదవీవిరమణ చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. గౌరవనీయులైన ఎంపీల నుంచి లభించిన ఆప్యాతతో పాటు అనుంబంధం అమూల్యమైందని, తనకు జ్ఞాపకంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.  ఈ కాలంలో భారతదేశం అపూర్వమైన ఆర్థిక పురోగతి, అసాధారణ అభివృద్ధిని చూడడం, అందులో భాగం కావడం తనకు గర్వకారణంగా నిలువడంతో పాటు సంతృప్తినిచ్చిందని తెలిపారు.
ఈ సమయంలో దేశానికి సేవ చేయడం తనకు నిజమైన గౌరవమని, పదవికి రాజీనామా చేస్తున్న సమయంలో భారత్‌ అద్భుతమైన విజయాలపై తాను గర్వంగా ఉన్నానని, దేశ ఉజ్వల భవిష్యత్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.  వాస్తవానికి ఆయన ఐదేళ్ల పదవీకాలం 10 ఆగస్టు 2027న ముగియాల్సి ఉంది. జగదీప్ ధన్‌ఖర్ వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడానికి ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు.

జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పలు సందర్భాల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఏడాది మార్చిలో హృదయ సంబంధిత సమస్యలతో ఎయిమ్స్ డిల్లీలో చికిత్స పొందారు. గత నెలలో ఆయన ఉత్తరాఖండ్‌లోని కుమాయున్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వేదికపై జారిపడ్డారు. భారత పార్లమెంటరీ చరిత్రలో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొదటి రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి కావడం గమనార్హం. డిసెంబర్ 2024లో ఆయనపై ప్రవేశపెట్టిన ఈ తీర్మానం తర్వాత సాంకేతిక కారణాలతో తిరస్కరించబడింది. ప్రతిపక్షం ఆయనపై తీవ్రమైన విమర్శలు చేసింది. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని విరుచుకుపడింది.

జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ జిల్లా, కితానా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తన పాఠశాల విద్యను చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత జైపూర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి బీ.ఎస్సీ, ఎల్ఎల్ బీ పట్టాలను పొందారు. 1979లో సుదేశ్ ధన్‌ఖడ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి కామ్నా అనే కుమార్తె ఉంది.

న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ధన్‌ఖడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సుదీర్ఘకాలం పనిచేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1989-1991 మధ్య జనతాదళ్ పార్టీ తరపున కిషన్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.1990-1991మధ్య కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.1993-1998 మధ్య రాజస్థాన్ నుండి కాంగ్రెస్ శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యేగా) ధన్‌ఖడ్ సేవలందించారు.

జగదీప్ ధన్‌ఖడ్ తన కెరీర్ లో మూడు పార్టీల్లో పనిచేశారు. జనతాదళ్ లో 1989 నుంచి 1991 వరకు పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ లో 1991 నుంచి 2003 వరకు సేవలు అందించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో 2003లో చేరారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగారు.

2019-2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఈ పదవిలో ఉన్నప్పుడు పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- ధన్‌ఖడ్ మధ్య నిత్యం మాటల యుద్దం నడిచేది. వీరిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు నిత్యం వార్తల్లో నిలిచేవి. 2022 ఆగస్టు 11: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ఆయన యూపీఏ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు.