బిసిలకు 42% రిజర్వేషన్లలో కేంద్రంపై నిందలు అన్యాయం

బిసిలకు 42% రిజర్వేషన్లలో కేంద్రంపై నిందలు అన్యాయం
బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారని, ఈ బిల్లుకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
 
రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిసేందుకు మొదటిసారిగా ఢిల్లీ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  అయితే, ఆర్డినెన్స్ రాకముందే, అందులో 10% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. బిజెపి మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, అయితే కేబినెట్ లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా? లేదా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50 శాతం క్యాప్ మించుతుందని గుర్తు చేశారు.  
 
బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 లో సవరణ చేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చూస్తోందని చెబుతూ  అసలు మీకు 9వ షెడ్యూల్ లో పంపించేటువంటి ప్రక్రియ మీకు తెలుసా? మీకు న్యాయసలహాదారులు చెప్పలేదా? అంటూ రామచందర్ రావు ప్రశ్నించారు. 
1973లో కేశవనంద భారతీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, 9వ షెడ్యూల్‌లో చేర్చినా, ఆ చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని గుర్తు చేశారు. జయలలిత తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చినా, అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఇంకా తుది నిర్ణయం రాలేదని చెప్పారు.  తమిళనాడులో జయలలిత రిజర్వేషన్ల విషయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి మైనారిటీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చించినా ఏమైందని ఆయన ప్రశ్నించారు.  
కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ కోసం 9వ షెడ్యూల్‌ను చూపిస్తూ మళ్లీ మళ్లీ ప్రజలను మభ్యపెట్టడం సబబుకాదని బిజెపి నేత హితవు చెప్పారు.  2006 ఐ ఆర్. కోహ్లీ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే పునరుద్ఘాటించిందని పేర్కొంటూ  ఈ విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేబినెట్‌కు, న్యాయసలహాదారులకు తెలియకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పేరొంటు బీసీలను మోసం చేసినందుకు, దగా చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పు తెలుసు, సెక్షన్ 285లో సవరణ అవసరం అన్నది తెలుసు, అయినా ఎందుకు అసలు చర్చించట్లేదు?  అని ప్రశ్నించారు. అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకాలు చేస్తోందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో 50% పైగా రిజర్వేషన్లు అమలయ్యాయని చెబుతూ ఆ విధానాలను కాంగ్రెస్ అధ్యయనం చేయాలని రామచందర్ రావు సూచించారు. హైకోర్టు చివాట్లు పెట్టేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించలేదని గుర్తు చేశారు. 
 
కాగా, తన పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొంతకాలంగా కలవనీయకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు విమర్సించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 19 నెలల్లో ఢిల్లీకి మొత్తం 46 సార్లు వెళ్లారని, ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ కీలక నేతలు ఆయనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని విస్మయం వ్యక్తం చేశారు. 
 
అయితే, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులను పలు సార్లు రేవంత్ కలవగలిగారని ఆయన గుర్తు చేశారు.   కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.  ఒకవైపు పార్లమెంటులో జరుగుతున్న అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్ అవుతున్న పరిస్థితి నెలకొందని చెబుతూ అటువంటి వారు బిజెపి మీద విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.