బిసిసిఐకి రూ.9,742కోట్ల రికార్డు ఆదాయం

బిసిసిఐకి రూ.9,742కోట్ల రికార్డు ఆదాయం

2024 ఆర్ధిక సంవత్సరంలో బిసిసిఐకి రూ.9,742కోట్ల రికార్డు ఆదాయం లభించిదని, ఇందులో ఐపిఎల్‌ ద్వారానే రూ.5,761కోట్లు నగదు జమ అయినట్లు తాజా గణాంకాలు పేర్కొన్నాయి. బిసిసిఐకి జమ అయ్యే ఆదాయంలో ఐపిఎల్‌ ద్వారానే 59శాతం వస్తున్నట్లు, ఇటీవల జరిగిన బిసిసిఐ వార్షిక నివేదికలో వెల్లడైంది.  అలాగే విదేశీ పర్యటనల్లో భారత్‌కు దక్కే వాటా మరింత పెంపుదలకు బిసిసిఐ కృషి చేస్తున్నది.

బ్రాడ్‌కాస్టింగ్‌, ప్రకటనలు, రెడిప్యూజన్‌ ప్రకారం 2023-24లో రూ.9.741కోట్లు ఆదాయం ఆర్జించినట్లు సమాచారం. మీడియా హక్కులు, స్ట్రీమింగ్‌, స్మార్ట్స్‌ ఒప్పందాలు వంటివి కూడా ఇటీవలికాలంలో భారీగా పెరిగినట్లు తెలుస్తున్నది. ఐపిఎల్‌ కాకుండా ఇతర మీడియా హక్కుల ద్వారా కూడా బిసిసిఐ కొంతమేర సమకూరినట్లు, ఆ సమకూరే ఆదాయంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు, టోర్నీ ప్రసార హక్కులతోపాటు ఇతర కోణాలనుంచి కూడా ఆదాయం వస్తున్నట్లు, ఆ వచ్చిన ఆదాయంలో ప్రధానంగా ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) బంగారు గుడ్లు పెట్టే బాతులా దొరికినట్లు బిసిసిఐ రిపోర్టు నివేదకల్లో ఉంది. 

ఐపిఎల్‌కు లభించే ప్రజాదరణతోనే ‘రంజీట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, సికె నాయుడు వంటి దేశీయ టోర్నీల నిర్వహణ కూడా సాధ్యమౌతుందని, ఇది మరోరకంగా వాణిజ్యీకరణకు దోహదపడుతున్నట్లు అందులో ఉంది. మీడియా హక్కులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. కనీసం రంజీట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు ఐపిఎల్‌ వేలం బరిలో ఉండనున్న దృష్ట్యా దేశీయ లీగుల్లో ఆడేందుకు యువ క్రికెటర్లు పోటీపడుతున్నారు.

దీంతో రంజీట్రోఫీని లాభాల బాటలో పెట్టేందుకు ఒకరకంగా ఐపిఎల్‌ కూడా దోహదపడుతుందని, స్టార్‌ క్రికెటర్లు దేశీయ టోర్నమెంట్‌లలో ఆడేందుకు వస్తుండడంతో ఈ లీగ్‌లను వీక్షించేందుకు వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని తాజా గణాంకాల సారాంశం.  అలాగే ఈ లీగ్‌ ఒక ఫ్రాంచైజీ కనీస మూల నిధి దాదాపు రూ.100కోట్లుగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇందులో ఆడేందుకు క్రికెటర్లు ఎగబడుతున్నారు. 

ఐపిఎల్‌ ద్వారా ఆదాయంలో 100శాతం వాటా బిసిసిఐకే సమకూరుతుందని, ప్రపంచ క్రికెట్‌లోనే అతిపెద్ద బోర్డు అయిన బిసిసిఐ వద్ద ప్రస్తుతం రూ.30వేల కోట్ల నిల్వలు ఉన్నాయని, ఆ నగదు నిల్వల ద్వారానే రూ.వెయ్యి కోట్లు వడ్డీ రూపంలోనే వస్తుందని తెలుస్తున్నది.  ఏడాది ఏడాదికి స్పాన్సర్‌ షిప్‌లు, మీడియా ఒప్పందాలు, మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయం 10 నుంచి 12 శాతానికి పెరుగుతోందని రీడిప్యూజన్‌ చీఫ్‌ సందీప్‌ గోయల్‌ రిపోర్టులో తెలిపారు. 

బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిమోన్‌ ఫ్రాన్సిస్‌ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఐపిఎల్‌ నిర్వహణ బిసిసిఐకి మంచి వ్యాపార నమూనా సృష్టించేందుకు దోహదపడిందని, దీని కారణంగానే ఐసిసి తన నిధుల్లో ఎక్కువభాగం రాబట్టేందుకు బిసిసిఐపై ఆధారపడాల్సి వచ్చిందని, ఐసిసి తన ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలను సరిగ్గా అన్వేషించడం లేదని పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఐపిఎల్‌ నిర్వహణకు ప్రధాన ఆటంకం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ రూపంలో ఎదురైందని, ఇది ఐపిఎల్‌-2025కు గట్టి ఎదురుదెబ్బ వంటిదని, దీని కారణంగానే షెడ్యూల్‌ ప్రకారం ముగియాల్సిన టోర్నీ మరో 10రోజులు పొడిగించబడిందని, ఆ తర్వాత జరిగినా ప్రధాన ఆటగాళ్లు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారని ఫ్రాన్సిస్‌ వాదించారు.  అలాగే మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)కు రాబోయే రోజుల్లో మరింత ఆదరణ లభించడం ఖాయమని కొనియాడారు. ఐపిఎల్‌ ద్వారానే ఎక్కువ నగదు వస్తుంటే.. ఇతర లీగ్‌ల ద్వారా వచ్చే ఆదాయం వైపు బిసిసిఐ దృష్టి సారించదని, ఇది నష్టదాయమని ఫ్రాన్సిస్‌ పాలకమండలి సమావేశంలో సూచించారు. 

ఇందుకోసం ఐపిఎల్‌లో ఈక్విటీ వాటాను తగ్గించుకొనేందుకు బిసిసిఐ ప్రయత్నించాలని, స్పాన్సర్‌షిప్‌లు పెంచుకొని, ఆదాయ పెంపుకు ప్రయత్నించాలని, దీంతో ఇతర దేశాల్లో క్రికెట్‌ ప్రాచుర్యం పొందడం ఖాయమని మథియాస్‌ సూచించారు. 2007 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి)లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డులతో హవా. కానీ 2007లో ఐపిఎల్‌ ప్రవేశంతో ఐసిసిలో బిసిసిఐ ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత ఐసిసి అధ్యక్షునిగా ఉన్న జే షా గతంలో ఐపిఎల్‌కు కార్యదర్శిగా పనిచేశారు. ఐసిసిలో మన పాత్ర పెరగడంతో జే షా ఎన్నికను వ్యతిరేకించేవారు ఎవ్వరూ లేకపోయారు. 

ఐపిఎల్‌ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతం ఐసిసికి ముట్టజెప్పడం, ఐపిఎల్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు కోట్లాది రూపాయలు ముట్టజెప్పడంతో ఈ లీగ్‌ జరిగే రెండున్నర నెలలు ఐసిసి టాప్‌-8జట్ల టోర్నీలన్నింటినీ దాదాపు నిలిచిపోతున్నాయి.